జిల్లాలో కొత్త చెరువుల కోసం రూ. 168.43 కోట్లతో ప్రతిపాదనలు
పరిపాలన అనుమతుల కోసం ఎదురుచూపులు
ఇప్పటికే సత్ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయ
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ) :ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి, బీడు భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా నాలుగు విడుతల్లో 411 చెరువులను పునరుద్ధరించగా, తాజాగా.. 7 కొత్త చెరువులు తవ్వేందుకు కసరత్తు చేస్తున్నది. ఇటీవల నీటిపారుదల శాఖ రూ.168.43 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పరిపాలన అనుమతులు వచ్చి.. నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టనుండగా, 10,120 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చే అవకాశముంది.
మిషన్ కాకతీయ పథకం ద్వారా ఇప్పటికే చెరువులను పునరుద్ధరించిన రాష్ట్ర సర్కారు.. జిల్లాలో కొత్తగా 7 చెరువులను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు సుమారు రూ.168.43 కోట్లతో ప్రాతిపాదనలు పంపించారు. వాంకిడి మండలం కిర్డి గ్రామం వద్ద రూ. 10.99 కోట్లతో కొత్త చెరువును తవ్వించి 1000 ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. ఇదే మండలంలోని సవాతి గ్రామం వద్ద రూ. 16.56 కోట్లతో మరో చెరువును కూడా నిర్మించి, 700 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలున్నాయి. కెరమెరి మండలం అగర్వాడ వద్ద రూ. 21.51 కోట్లతో చెరువును తవ్వి 2500 ఎకరాలు, బిజిరిఖైరి వద్ద రూ. 31.95 కోట్లతో చెరువును తవ్వి 1600 ఎకరాలు, జైనూర్ మండలం ఆశపెల్లి వద్ద రూ. 4.50 కోట్లతో నిర్మించే చెరువు ద్వారా 400 ఎకరాలు, సిర్పూర్-యు మండలం మామిడిపెల్లి వద్ద రూ. 1.44 కోట్లతో 120 ఎకరాలకు సాగునీరు అందించేందుకు మరొక చెరువును నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలం అడ దస్నాపూర్ వద్ద రూ. 81.48 కోట్లతో 3800 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కొత్త చెరువును నిర్మించనున్నారు. ఈ కొత్త చెరువుల నిర్మాణం పూర్తయితే సుమారు 10,120 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముంది.
సద్వినియోగం చేసుకునే దిశగా..
ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి జలవనరులకు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతోంది. కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడుతల్లో రూ. 128 కోట్ల 93 లక్షలతో 411 చెరువులను బాగు చేయగా, 37 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం కొత్తగా 7 చెరువులను నిర్మిస్తే మరో 10,120 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశముండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ గుణవంతరావును వివరణ కోరగా, 7 కొత్త చెరువుల కోసం జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.