భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 26: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి కార్మికుల పక్షపాతని, సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అధ్యక్షతన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. దీనికి శాసన సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ తీర్చుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఉన్న సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో 1000 క్వార్టర్స్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో స్థానిక సమస్యలన్నింటినీ సింగరేణి అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నాయకులందరూ కలిసికట్టుగా పని చేస్తూ టీబీజీకేఎస్ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఇతర కార్మిక సంఘాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీబీజీకేఎస్ నాయకులందరూ కలిసికట్టుగా ఉంటేనే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర రమేశ్, కళ్లెపు రఘుపతి రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జనార్దన్, కౌన్సిలర్లు, టీబీజీకేఎస్ నాయకులు ఆగయ్య, మల్లయ్య, రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.