కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వే
సర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరణ
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
మరో వారంలో ముగియనున్న ప్రక్రియ
తేలనున్న సాగు విస్తీర్ణం
దిగుబడిపై పక్కగా అంచనా..
కొనుగోళ్ల సమయంలో తగినట్లుగా వసతులు కల్పించుకోవచ్చు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటల సాగు ఏటేటా పెరుగుతోంది. వానకాలం ప్రారంభంలో వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసే పంటల సాగు.. ఆ తర్వాత వేసే పంటల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ క్రమంలో పంటల దిగుబడి అంచనాలు తప్పి.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
ఆసిఫాబాద్ జిల్లాలో 4.51 లక్షల ఎకరాల్లో..
ఆసిఫాబాద్ జిల్లాలో ఈసారి 4 లక్షల 51 వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా కురుస్తుండడంతో పంటలపై రైతులు మంచి అంచనాలు వేసుకుంటున్నారు. బోర్ల కింద వ్యవసాయం చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తో రైతులు బోర్లను వేసుకుంటూ తమ సాగును పెంచుకుంటున్నారు. జిల్లాలో వరిసాగు 3 లక్షల 35 వేల 175 ఎకరాలు, వరి 54 వేల ఎకరాలు, కంది 46 వేల ఎకరాలు, పెసర 3 వేలు, జొన్న 29 వేలు, మిగతా వివిధ రకాల పంటలు సాగు అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు.
కొనసాగుతున్న సర్వే..
రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పంటల సర్వే నిర్వహించి, దిగుబడి అంచనా వేసి .. కొనుగోళ్ల సమయంలో అందుకనుగుణంగా వసతులు కల్పించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. జిల్లాలోని 70 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన రైతుబంధు సమితులు సహాయ సహకారాలను సర్వే కోసం వినియోగించుకుంటున్నారు. సాగును పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. క్లస్టర్ పేరు, రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారు, ఆధార్, భూమి స్వభావం, దిగుబడి అంచనా, ఒక్కో రైతు ఎన్ని పంటలు సాగుచేస్తున్నారు ఇలా అన్ని రకాల వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యేక ఫార్మాట్లో నమోదు చేసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. వారం రోజులుగా సర్వే కొనసాగుతుండగా, మరో వారంలో పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సర్వే పూర్తయితే పక్కగా దిగుబడి అంచనా వేయవచ్చు. దీని ఆధారంగా పంటల కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.