రూ.2,70,144 రికవరీ
రూ.2 వేలు జరిమానా
కాసిపేట, జూలై 26 : కాసిపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం డీఆర్డీవో శేషాద్రి ఆధ్వర్యంలో ఈజీఎస్ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో రూ.2,70,144 రికవరీ, రూ.2 వేలు జరిమానా విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2018 డిసెంబర్ నుంచి 2021 మే వరకు ఈజీఎస్ కింద చేపట్టిన ఉపాధి హామీ పనులపై ప్రజా వేదికలో సామాజిక తనిఖీ బృందం మండలంలోని 22 గ్రామ పంచాయతీల వారీగా నివేదికను చదివి వినిపించారు. పనుల్లో తప్పులు, చెల్లింపుల్లో తేడాలపై తనిఖీ బృందం వివరాలను బహిర్గతం చేసింది. గ్రామాల కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది వివరణ ఇచ్చారు. చెల్లింపులో తేడాలున్న వారికి రికవరీకి ఆదేశించారు. కొన్ని పంచాయతీల్లో ఈజీఎస్లో పని చేసే మేట్లు కార్యదర్శులకు, ఈజీఎస్ అధికారులకు తెలియకపోవడంపై జడ్పీటీసీ పల్లె చంద్రయ్య అసహనం వ్యక్తం చేశారు. గట్రావ్పల్లి పంచాయతీలో ఈజీఎస్లో తప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారని, పనులు చేయకుండానే ఇస్తున్నారని ఆదివాసీ సంఘం నాయకులు ఆత్రం జంగు మండి పడ్డారు.
డీఆర్డీవోకు వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. ప్రతి పంచాయతీ పనుల్లో చాలా వరకు చెల్లింపుల్లో, పనుల్లో తేడాలు ఉండడంపై సంబంధిత ఈజీఎస్ సిబ్బందికి, కార్యదర్శులకు షోకాజు నోటీసులు ఇవ్వనుండగా సవరణలకు, రికవరీలకు ఆదేశించారు. దేవాపూర్లో రూ.17429, చిన్న ధర్మారంలో రూ.15846, ధర్మారావుపేటలో రూ.31787, మామిడిగూడలో రూ.55 171, సోమగూడెంలో రూ.19910, గట్రావ్పల్లిలో రూ.38359, బుగ్గగూడలో రూ.5076, లంబాడితండా(డి)లో రూ.32531, పెద్దనపల్లిలో రూ.388, వెంకటాపూర్లో రూ.15426, కోమటిచేనులో రూ.12621, సోనాపూర్లో రూ.18332, కొండాపూర్లో రూ.5195, పల్లంగూడలో రూ.788, కోనూర్లో రూ.1285 చొప్పున రికవరీకి ఆదేశించారు. అదనంగా లంబాడీతండా(డి)లో రూ.1000, పల్లంగూడకు రూ.1000 జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, ఎంపీడీవో ఎంఏ అలీం, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఏపీడీ మల్లేశం, సర్పంచ్లు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.