కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఐకేపీ కార్యాలయంలో శిక్షణ తరగతుల పరిశీలన
ఆసిఫాబాద్ ,జూలై 26 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా త్వరలోనే చిరుధాన్యాలతో తయారుచేసిన పోషకాహారాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వారం పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన సందర్శించి పలు సూచనలు ,సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల్లో చిరుధాన్యాలతో వంట పదార్థాలు చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్లో మూడు, రెబ్బెనలో రెండు కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఈ కేంద్రాల్లో వారం పాటు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు తయారు చేసి గర్భిణులు , పిల్లలకు ఎలా అందజేయాలనే విషయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిద్వారా స్వయం సహాయక సంఘాలకు కూడా ఉపాధి దొరుకుందని తెలిపారు. ఈ నెల 31 వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ , ఐకేపీ అధికారులతో సమావేశం నిర్వహించి చిరుధాన్యాల పంటలపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి , మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, జిల్లా వైద్యాధికారి మనోహర్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇన్చార్జి పీడీ రవికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్ టౌన్, జూలై 26 : గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా ఇన్చార్జి విద్యాధికారి ఉదయ్ బాబుతో కలిసి సోమవారం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రదర్శనలు పంపేందుకు చివరి తేదీని ఆగస్ట్ 10 వరకు పెంచినట్లు తెలిపారు. ప్రదర్శనలను 91006785435కు పంపాలన్నారు. పూర్తి వివరాలకు ఇన్చార్జి జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ను 9441140 434 నంబర్లో సంప్రదించాలని సూచించారు.