ఆదిలాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాల పంపిణీ ప్రక్రియ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20,129 కార్డులు మంజూరు కాగా.. వీటిని ఈ నెల 30 వరకు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రి , ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేపట్టారు. నిర్మల్ పట్టణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తానూర్లో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్లో ఎమ్మెల్యే బాపురావ్ పంపిణీ చేశారు. కార్డులను చూపిస్త్తూ లబ్ధిదారులు మురిసిపోయారు. కాగా.. కొత్త కార్డుదారులకు ఆగస్టు నెల నుంచి సర్కారు బియ్యం పంపిణీ చేయనుంది.
పక్క చిత్రంలో ఉన్నది.. నిర్మల్ జిల్లాలోని డ్యాంగాపూర్కు చెందిన మెంగరి అనిల్-లహరిక. వీరి పిల్లలు ఆకృతిక, ఆదిత్య. వీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా సర్కారు మంజూరు చేసింది. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. వచ్చే నెల నుంచి మాకు బియ్యం వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి కొత్త రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. గతంలోనే కొత్త రేషన్కార్డుల కోసం సర్కారు దరఖాస్తులు ఆహ్వానించింది. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఈ నూతన రేషన్ కార్డులను సోమవారం మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తానూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ కమిటీ, శాంతినగర్లో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ రేషన్కార్డులు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్, మంచిర్యాల పట్టణంలోని సీసీసీ టౌన్షిప్లోని ఆఫీసర్స్ క్లబ్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ధ్రువీకరణ పత్రాలను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పంపిణీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు,కలెక్టర్ రాహుల్రాజ్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డు పత్రాలను అందజేశారు. సిర్పూర్ కాగజ్నగర్ మండలంలోని నజ్రుల్నగర్ విలేజ్ నం.12లో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రేషన్ కార్డుల పత్రాలను పంపిణీ చేశారు.
పేదల కడుపు నింపడానికే కార్డులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాలు అందించిన అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడారు. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం కొత్తకార్డులు మంజూరు చేసిందన్నారు. ప్రజలు ప్రతి నెలా బియ్యం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా సమయంలోనూ పేదలు ఆకలితో అలమటించకుండా రేషన్కార్డుల లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. సర్కారు రేషన్కార్డులు అందించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
రుణపడి ఉంటా
కాగజ్నగర్, జూలై 26 : తెలంగాణ రాష్ట్రం రాకముందు పేదలను పెద్దగా పట్టించుకున్నోళ్లు లేరు. ఏదైనా పని కోసం ఆఫీసులకు పోతే అస్సలు పట్టించుకునేవాళ్లు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నడు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వచ్చిందని అధికారులు చెప్పిన్రు. ఇయ్యాల మా ఎమ్మెల్యే కోనప్ప చేతుల మీదుగా కార్డు అందుకున్న. వచ్చే నెల నుంచి మా ఇంట్లో ఒక్కొక్క రికీ 5 కిలోల చొప్పున బియ్యం వస్తయి. మాకు రేషన్ కార్డు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం. – శ్రీనివాస్,కాగజ్నగర్
రేషన్కార్డు లేక ఇబ్బందులు పడ్డాం..
మాది నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామం. నాకు ఇద్దరు సంతానం. కొడుకులు వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు. గతంలో తన పేరు మీద ఉన్న రేషన్కార్డును ఓ కొడుకు తీసుకొని నా పేరును అందులో నుంచి తీసివేశారు. అప్పటి నుంచి నాకు రేషన్ బియ్యం రావడం లేదు. ఇప్పుడు నా వయస్సు 65 ఏండ్లు. ఈ సమయంలో పింఛన్ ప్రతినెలా అందుకుంటుండగా.. కొత్త రేషన్కార్డు ఇప్పుడు మంజూరు కావడంతో ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతా. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. – భోజవ్వ, ఎల్లపెల్లి, వృద్ధురాలు.