హాజీపూర్, అక్టోబర్ 25 : కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్వంలో యూనిలివర్, డీఫ్ఐడీ భాగస్వామ్యంతో అగాఖాన్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కళాజాత ప్రదర్శన మొబైల్ వ్యాన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ వ్యాన్లో యునిలివర్ రూపొందించిన పాటల ద్వారా కరోనా నివారణకు పాటించాల్సిన నిబంధనలు, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, మాస్క్ ధరించడంపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కళాకారుల బృందం జిల్లాలో 10 రోజుల పాటు కోటపల్లి, కాసిపేట, వేమనపల్లి, భీమిని తదితర మండల్లాలో కనీసం 3, 4 గ్రామాల్లో ప్రదర్శనలను నిర్వహించనున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవి, అగా ఫౌండేషన్ హెచ్బీసీసీ మేనేజర్ కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
యాసంగిలో వరిధాన్యం సాగుపై కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం యాసంగిలో వరికి బదులు వరికి బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు పువ్వు, నువ్వులు, పెసర, మినుములు, జొన్న, జనుము, కూరగాయలు వంటివి సాగు చేసే విధంగా రైతులను సమాయత్తం చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రైతు వేదిక స్థాయిలో, గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పంట మార్పిడి చేయడంతో భూసారం పెరగడంతో పాటు, పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో బోరు బావుల కింద 62 వేల ఎకరాలు, చెరువుల కింద 11 వేల ఎకరాలు, కాలువల కింద 21 వేల ఎకరాలు, ఎత్తి పోతల పథకం కింద 8 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. దొడ్డు రకం వనిని ఎఫ్సీఐ వచ్చే యాసంగి నుంచి కొనేందుకు నిరాకరించిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించే విధంగా దృష్టిసారించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల పై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్ వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం కో -ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధి ఉదయ్ కుమార్, తెలంగాణ సీడ్స్ ప్రతినిధి భావన, జిల్లా ఉద్యానవన శాఖ అధికారితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.