మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 25: తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులను కౌన్సిలర్లు కోరారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను చైర్మన్, కమిషనర్ల దృష్టికి తీసుకువచ్చారు. పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరాలో, మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణాలతో సమస్యలు నెలకొన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల నిర్లక్ష్యం, అసమర్థ, పట్టింపులేనితనంపై ప్రశ్నించారు. మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం కోసం సిమెంట్ రోడ్లను తవ్వి సరిగ్గా పూడ్చడం లేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మర్కెట్ ఏరియాలో రోడ్లన్నీ తవ్వారని చెప్పారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఈ విషయంపై మిషన్ భగీరథ ఏరియా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరగా పనులు పూర్తి చేస్తామని, టెస్టింగ్ కోసం కొన్ని ప్రాంతాల్లో పైపులు వేసి వదిలేశామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్ లైన్ల పొడిగింపు, విద్యుత్ దీపాల ఏర్పా టు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ఇనుప స్తంభాల తొలగింపు వంటి సమస్యలపై ఆ శాఖ ఏడీ వెంకటేశ్వర్లును కౌన్సిలర్లు మాదంశెట్టి సత్యనారాయణ, మజీద్, మోతె సుజాత ప్రశ్నించారు. 15రోజుల్లో పట్టణంలో సర్వేచేసి, సమస్యలు పరిష్కరిస్తామని ఏడీ తెలిపారు. కౌన్సిలర్ చైతన్యరెడ్డి మాట్లాడుతూ రాంచెరువులో బతుకమ్మ నిమజ్జనానికి అనువుగా మెట్లను నిర్మించాలని గతేడాది కోరినా నిర్మించలేదన్నారు. ఓపెన్ జిమ్లో పరికరాలు చెడిపోయాయని, గేటు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను అధికారులు తయారు చేయకపోవడం బాధాకరమైన విషయమని, ఉద్యోగికి వృత్తిలో భాగమైన ఈ అంశాన్ని మున్సిపల్ అధికారులు విస్మరించడం శోచనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ ముకేశ్గౌడ్ పేర్కొన్నారు. కౌన్సిలర్ సురేశ్బల్దవా మాట్లాడుతూ ఓవర్బ్రిడ్జివద్ద జంక్షన్ను అభివృద్ధి చేయాలని, పట్టణానికి మూడు వైపులా ఉన్న ప్రధాన రహదారులపై స్వాగత తోరణాలను ఏర్పాటుచేయాలని కోరారు. బెల్లంపల్లి చైరస్తా జంక్షన్ అభివృద్ధి కోసం కోర్టులో ఉన్న స్థలం విషయంలో సంబంధిత వ్యక్తులతో మాట్లాడాలని చైర్మన్ నిర్ణయించారు. అనంతరం ఓవర్ బ్రిడ్జినుంచి పాతమంచిర్యాల వరకు సెంట్రల్ డివైడర్, రోడ్డు వెడల్పు పనులను రూ. 6 కోట్ల పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి చేపట్టడానికి కౌన్సిల్ పరిపాలనా మంజూరు లభించింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.