శ్రీరాంపూర్, సెప్టెంబర్ 25 : సింగరేణి ఉద్యోగులందరికీ వారంలోగా కరోనా రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి శనివారం సాయంత్రం అన్ని ఏరియాల జీఎంలతో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముందుగా జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ అన్ని ఏరియాల వారీగా వ్యాక్సినేషన్ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా సాగాలని సీఎండీ ఎన్ శ్రీధర్ కోరుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధచూపాలని కోరిందన్నారు. అనంతరం డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. 40,525 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తి చేసి, చాలా రోజులైందని గుర్తుచేశారు. మొదటి డోసు తీసుకోని 2,695 మందికి త్వరలోనే పూర్తిచేయాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 26,213 మంది కార్మికులకు మాత్రమే రెండో డోసు పూర్తయ్యిందని, మిగతా 14,312 మందికి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దవాఖానల్లో సౌకర్యాల పెంపునకు సీఎండీ శ్రీధర్ ప్రత్యేక దృష్టిపెట్టారని, ఏరియాల జీఎంలు సంబంధిత వైద్య విభాగంతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వ్యాక్సినేషన్కు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారి జాబితా సిద్ధం చేసి, పర్సనల్, వైద్య అధికారులు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 90 శాతం మంది పొరుగు సేవల సిబ్బందికి మొదటి డోసు విజయవంతంగా పూర్తి చేయడంపై అభినందించారు.
అలాగే ఏరియా దవాఖానల్లో వసతులు పెంచేందుకు వైద్య పరికరాల సమకూర్పు, వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది నియామకానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏరియాల వారీగా తమ పరిధిలోని దవాఖనలకు కావాల్సిన సదుపాయాలు, వసతులపై మూడు రోజుల్లోగా జీఎంలు నివేదిక సమర్పించాలని సూచించారు. వీటి ఆధారంగా తగు చర్యలను తక్షణమే తీసుకుంటామని చెప్పారు. అలాగే పర్సనల్ విభాగం అధికారులు కార్మికుల సమస్యల పరిష్కారానికి స్నేహ పూర్వక పద్ధతిలో వ్యవహరించాలని సూచించారు. ఏరియాల వారీగా అన్ని సమస్యలు పరిష్కరించాలని, విధానపరమైన వాటిని తమకు నివేదించాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏరియాల వారీగా నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వచ్చిన వినతులపై సత్వరమే స్పందించాలన్నారు. ఈ సమీక్షలో హైదరాబాద్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాథా శ్రీనివాస్, జీఎం (స్టాటెజిక్ ప్లానింగ్) సురేందర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, ఎస్ఈ సంజీవరెడ్డి, కార్పొరేట్ నుంచి జీఎం (సీపీపీ) కే నాగభూషణ్రెడ్డి, ఎస్వోటూ డైరెక్టర్ దేవికుమార్, శ్రీరాంపూర్ ఏరియా నుంచి జీఎం ఎం సురేశ్, ఎస్వోటూ జీఎం కే హరినారాయణగుప్తా, డీవైజీఎం గోవిందరాజు, డీవైసీఎంవో డాక్టర్ రమేశ్బాబు, డాక్టర్ లోక్నాథ్రెడ్డి పాల్గొన్నారు.