మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 25 : స్వాత్రంత్య్రోద్యమ కారుల పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ, స్వాత్రంత్య్రం సిద్ధించిందని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా – 75వ వార్షికోత్సవంలో భాగంగా శనివారం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ను నిర్వహించారు. మైదానంలో అందరిచే ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల, ఉద్యమకారుల, మహానుభావుల పోరాటం, ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ – స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని చెప్పారు. కొవిడ్ – 19 విపత్కర పరిస్థితులు, సమాజంలో నెలకొన్న సమస్యలను మనమంతా సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కేంద్ర సాయుధ దళాలు, ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు, యూత్ క్లబ్లు, కేంద్ర, రాష్ట్ర విభాగాలు, సంస్థలు, 5 కోట్ల మందికి పైగా ప్రజలు కోటి కిలో మీటర్ల దూరం పాల్గొన్నారని తెలిపారు. అక్టోబర్ 2 వరకూ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ రోజువారీ జీవితంలో కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, పరుగు, క్రీడలు వంటి ఫిట్నెస్ కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అఖిల్ మహాజన్, జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.