నార్నూర్ మండలంలో 4,956 మంది అర్హులు
రూ.5లక్షలతో బాధిత కుటుంబాలకు ఊరట
ఇప్పటికే 85 కుటుంబాలకు రూ.4కోట్ల 25 లక్షలు చెల్లింపు
నార్నూర్, ఆగస్టు 25: ఆపత్కాలంలో అన్నదాత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం. విషాదం అలుముకున్న ఇండ్లల్లో ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. కరోనా, ఇతర కారణాలతో మృత్యువాతపడిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందజేసి, ధీమా కల్పిస్తున్నది.
మూడేళ్లుగా అమలు…
మండలంలో 6,585 మంది రైతులు ఉండగా అందులో 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారు 4,956 మంది ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ ప్రభుత్వం ఏడాదికి రూ.3,300 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నది. ఈ పథకం ప్రారంభమై ఇప్పటికే మూడేళ్లు గడుస్తుండగా ఇప్పటి వరకు మృతి చెందిన 85మంది కుటుంబాలకు రూ. 4 కోట్ల 25లక్షలు చెల్లించినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మరో ఎనిమిది కుటుంబాలకు చెల్లించాల్సి ఉందన్నారు.
బీమాకు అర్హులు వీరే…
18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండి, కనీసం గుంట భూమి ఉన్న వారికి కూడా రైతుబీమా వర్తిస్తుంది. అర్హులైన రైతులు తమ ఆధార్కార్డు, పట్టా పాస్పుస్తకం, నామినీ ఆధార్కార్డు నామినేషన్ పత్రంతో జత చేసి సంబంధిత వ్యవసాయ అధికారికి అందించాలి. ఆ రైతు ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులు సంబంధిత రైతు మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, పట్టా పాస్పుస్తకం జిరాక్స్ ప్రతులను మండల వ్యవసాయాధికారికి అందిస్తే 15 రోజుల్లో నామినీ ఖాతాలో రూ.5లక్షలు జమ చేస్తారు.
వివరాలు ఇవ్వాలి…
భూమి ఉండి 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి. పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులను వ్యవసాయాధికారులకు ఇవ్వాలి. ఈ పథకం అన్నదాతలకు గొప్ప వరం. రైతులకు సందేహాలుంటే స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
-గిత్తే రమేశ్, వ్యవసాయాధికారి, నార్నూర్