98 కేంద్రాల ఏర్పాటు.. కొవాగ్జిన్కు అధిక మంది అర్హులు
ఇప్పటివరకు మూడు లక్షల వరకు వ్యాక్సినేషన్
ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ మంగళవారం ప్రారంభమైంది. 98 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేయగా.. అర్హులు కేంద్రాలకు తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేయగా 312, నిర్మల్లో 22 కేంద్రాల్లో 1,360, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 24 సెంటర్లలో 474, మంచిర్యాలలో 26 కేంద్రాల్లో 670 మంది టీకా వేసుకున్నారు. కొవాగ్జిన్ టీకా మొదటి డోస్ తీసుకున్న వారికి నాలుగు వారాల గడువు మాత్రమే ఉండడంతో అధిక మంది అర్హులుగా ఉన్నారు. కొవిషీల్డ్కు రెండో డోస్ల మధ్య 12 వారాల గడువు ఉండడంతో వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాల్లో తక్కువ మంది కనిపించారు. టీకా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్కు ముందు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు దాటిన వారికి వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 101 కేంద్రాలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి టీకా ఇచ్చారు. జిల్లా, కమ్యూనిటీ, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జిల్లా దవాఖానలో 400-500ల మందికి, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో 100-125 మందికి టీకా వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆరంభంలో స్పందన లేకపోవడంతో టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వైద్యశాఖ అధికారులు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం ముందుకొచ్చారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అర్హులైన వారికి ఇచ్చారు. 45 ఏండ్లు దాటిన వారు ఆధార్కార్డు తీసుకుని దవాఖానకు వస్తే సిబ్బంది వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి టీకా ఇచ్చారు. లాక్డౌన్ కంటే ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3 లక్షల మందికి వైద్యశాఖ అధికారులు వ్యాక్సిన్ ఇవ్వగా.. వీరిలో నిర్మల్ జిల్లాకు చెందిన వారు 1.20 లక్షల మంది ఉన్నారు.
ప్రారంభమైన రెండో డోస్
మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకుని రెండో డోస్కు అర్హులైన వారందరికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి అధికారులు టీకా పంపిణీ ప్రారంభించారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో 98 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేయగా 312, నిర్మల్లో 22 కేంద్రాల్లో 1,360, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 24 సెంటర్లలో 474, మంచిర్యాలలో 26 కేంద్రాల్లో 670 మంది టీకా వేసుకున్నారు. కొవాగ్జిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్కు నాలుగు వారాలు, కొవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాలు గడువు ఉండాలని వైద్యశాఖ అధికారుల సూచించారు. ఈ మేరకు రెండో డోస్కు అధికం గా కొవాగ్జిన్ తీసుకున్న వారికి అవసరమైంది. లాక్డౌన్ కారణంగా ఉదయం టీకా కోసం ప్రజలు పంపిణీ కేం ద్రాలకు చేరుకున్నారు. వ్యాక్సిన్కు అర్హులైన వారి కోసం సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారందరూ తమ సమీపంలోని టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు తెలిపారు. కాగా.. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా మంగళవారం 11 కేంద్రాల్లో 670 మందికి వ్యాక్సిన్ వేశారు. హెల్త్ కేర్ వర్కర్స్ నలుగురు, ఫ్రంట్లైన్ వారియర్స్ 29, 60 ఏండ్లు పైబడినవారు 194, 45-59 మధ్య వయస్సు వారు 443 మంది రెండో డోస్ వేసుకున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 80,824 మంది మొదటి డోస్, 15,032 మంది రెండో డోస్ వేసుకున్నారు. కు మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడుత టీకాలు 47,621 మంది వేసుకున్నారు. దీనిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 5,131, ఫ్రంట్లైన్ వారియర్స్ 5,131, 45 ఏండ్లు పైబడిన వారు 23,547, 60 ఏండ్లు పైబడిన వారు 15,985 మంది టీకాలు వేసుకున్నారు.