ఆదిలాబాద్ రూరల్, జూలై 23: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సంత్ శ్రీ అసారాం బాబా ఆశ్రమంలో శుక్రవారం నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గురుపౌర్ణమి రోజున గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గురువులను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ వెనుగంటి ప్రకాశ్, సంత్ శ్రీ ఆసరాం బాబా సేవా సమితి అధ్యక్షుడు పొచ్చన్న, మురళి, దయాకర్, రాజారెడ్డి పాల్గొన్నారు.
గురువుల రుణం తీర్చుకోలేనిది.
తాంసి, జూలై 23 : తల్లిదండ్రుల తర్వాత గురువుకు మాత్రమే ఆ స్థానం కల్పించారని, గురువుల రుణం తీర్చుకోలేనిదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని పొన్నారిలో సంకటమోచన హనుమాన్ మందిరంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన గురువు మేఘరాజ్ శర్మను సన్మానించి, పాద పూజ నిర్వహించారు. తల్లిదండ్రులు జన్మనిస్తారని, కానీ గురువు మాత్రం జీవితాన్ని ప్రసాదిస్తారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గజేందర్ గుండావార్, మర్సుకోల తిరుపతి ఉన్నారు.