వినియోగించడం, సాగు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి
డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలి
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ పోలీస్ అధికారులతో సీపీ చంద్రశేఖర్ రెడ్డి
మంచిర్యాల, అక్టోబర్ 22, నమస్తే తెలంగాణ : మత్తు పదార్థాలు వినియోగించే వారిపై, సరఫరా, ఉత్పత్తి చేసే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ పోలీస్ అధికారులతో సీపీ చంద్రశేఖర్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. వారికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను గంజాయి రహిత జిల్లాలుగా మార్చేందుకు పోలీస్ అధికారులు సంసిద్ధలై ఉండాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను వినియోగించినా, సాగు చేసినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పీడీ యాక్టు అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని నిఘా ఉంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గంజాయి సాగు చేసే గుర్తించాలని సూచించారు. అసైన్డ్ భూముల్లో సాగు చేస్తే ఆ భూములను స్వాధీనం చేసుకోవడం, పట్టా భూముల్లో సాగుచేస్తే రైతు బంధు, రైతు బీమా పథకాల రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, కుమ్రం భీం ఆసిఫాబాద్ అడ్మిన్ ఎస్పీ వై.వీ.ఎస్ సుధీంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ కమలాకర్, రామగుండం కమిషనరేట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని డీసీపీ, ఏసీపీ, డీఎస్పీలు, ఎస్ఐలు, సర్కిల్ అధికారులు, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.