ఎదులాపురం,అక్టోబర్ 22:బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో ఆర్థికంగా ఎదిగి.. క్రమం తప్పకుండా కిస్తులు చెల్లించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ ఎదుట రుణవిస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలవద్దకే రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడం హర్షణీయమన్నారు. గతంలో రుణాలకోసం అవసరమైన పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగేవారన్నారు. ప్రస్తుతం బ్యాంకులే రుణమేళాలను నిర్వహించి ప్రజల అవసరాలను తీరుస్తున్నాయని చెప్పారు. దీనిని నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహ, వాహన, విద్య, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు మందుకు వస్తున్నాయని తెలిపారు. అర్హులైన వారందరూ ఆన్లైన్ ద్వారా డాక్యుమెంటేషన్ చేసుకోవాలన్నారు. పూర్వాపరాలు, సిబిల్ స్కోర్ ప్రకారం రుణాలు అందిస్తారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9500 మహిళా గ్రూపులకు రూ.198 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు. అక్టోబర్ మాసాంతానికి రూ.118 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.93 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందజేశారని పేర్కొన్నారు.
రూ.25 కోట్ల లక్ష్యం కాగా రూ.10 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రపుల్లకుమార్ జానా మాట్లాడుతూ.. రుణాల కోసం ఆన్లైన్ డాక్యుమెంటేషన్ చేస్తున్నామన్నారు. డీఆర్డీఏ కిషన్ మాట్లాడుతూ… పరిశ్రమలు, వ్యాపారం, వ్యక్తిగత రుణాల్లో జిల్లా 5వ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఆదేశాల మేరకు రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 19 బ్యాంకులు స్టాల్ను ఏర్పాటు చేశాయన్నారు. జన శిక్షణ్ సంస్థాన్ వారిచే వివిధ రకాల శిక్షణ పొందిన 400 మంది నిరుద్యోగ యువత రుణాల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు ప్రతినిధి సురేందర్ తెలిపారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా 362 మహిళా సంఘాలకు రూ.10.34 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం సూర్యప్రకాశ్, ఏపీడీ చరణ్దాస్, టీజీబీ ఆర్ఎం రఘునందన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ సూర్యప్రకాశ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్రాజు , సూపరిటెండెంట్ సత్యనారాయణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఐకేపీ సిబ్బంది, మహిళా గ్రూప్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది తదితరులు ఉన్నారు.