ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
అధికారులతో సమావేశం
ఎదులాపురం,జూలై 22 : అడవుల జిల్లా ఆదిలాబాద్లో అటవీశాఖ కార్యకలాపాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించి అడవుల జిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ జిల్లా అటవీ పునరుద్ధరణ, అటవీ సంరక్షణ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ పునరుద్ధరణ చర్యల్లో అధికారులకు సహకరించేందుకు ఒక్కో అటవీ బ్లాక్కు ఒక జిల్లా అధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించనున్నామని తెలిపారు. జిల్లాలో అటవీ సంరక్షణకు పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన చర్యలతో మూడు సంవత్సరాలుగా వచ్చిన మార్పులను ఈ సందర్భంగా వివరించినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు హరితహారంలో భాగంగా చేపట్టిన అటవీ పునరుద్ధరణ చర్యలను సమీక్షించారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. అటవీ సంపద స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లు, అటవీభూముల ఆక్రమణదారులపై సంయుక్తంగా ఇకమీదట కూడా ఇదే విధమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. అడవులపై ఆధారపడి ఆదివాసీలు సేకరిస్తున్న ఇప్పపువ్వు, వెదురు సేకరణపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీ ఆక్రమణదారులపై ఐటీడీఏ ద్వారా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. అటవీ పునరుద్ధరణకు శాఖ చేపట్టిన వివిధ చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్డీవో కిషన్, ఆర్డీవో జాడె రాజేశ్వర్, ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, అటవీ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
త్వరితగతిన పనులు నిర్వహిస్తూ శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్మశాన వాటికల నిర్మాణాల్లో వేగం పెంచాలని, కూలీల సంఖ్య పెంచుకొని రాత్రింబవళ్లు పనిచేస్తూ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి శ్మశాన వాటికల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ హర్షవర్ధ్దన్ శ్రీవాస్తవ్, డీఆర్డీవో కిషన్, పంచాయతీ అథికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న 48 గంటల్లో వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టర్ నుంచి పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఏ సమాచారమైనా ఈ కంట్రోల్ రూమ్కు తెలియజేయాలన్నారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో రెండు రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఉట్నూర్, బోథ్లో ఉంచామన్నారు. మరొకటి నేరడిగొండలో ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద నిలిపివేస్తున్నామని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎం.నటరాజ్, ఇరిగేషన్ ఎస్ఈ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎస్సీ ఈపీ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు కింద పడినా, నీటిలో మునిగినా వెంటనే సెల్ నంబర్లు 94408 11700, 94408 11671కు తెలియజేయాలని పేర్కొన్నారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు క్యాంప్ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలీస్స్టేషన్ అధికారులు తమ పరిధిలోని మండల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. చెరువుల్లో ఇంతకుముందు తీసిన గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, జలపాతాల వద్ద విహార యాత్రలు చేపట్టరాదని సూచించారు. అటవీ, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయం తో జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు. జిల్లా ప్రజలకు, పోలీస్ యంత్రాంగానికి ఎలాంటి సహాయం కావాల న్నా పోలీస్ కంట్రోల్రూమ్ నంబర్ 81066 74510కు ఫోన్ చేయాలన్నారు. డయల్ 100 ను సైతం సంప్రదించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా పరిస్థితులపై ఎప్పటికప్పు డు పర్యవేక్షణ కోసం ఏఎస్పీ హర్షవర్థన్ శ్రీవాస్తవ్, సీఐ గంగాధర్, ఎస్ఐ షేక్ అబ్దుల్ బాకీని నియమించినట్లు తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎన్.ఉదయ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.మల్లేశ్, సీఐ, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.