దిశా నిర్దేశం చేయనున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సారథ్యం
ప్రతి నియోజకవర్గం నుంచి హాజరుకానున్న 25 మంది
నేడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం
ఆదిలాబాద్ ప్రతినిధి/ మంచిర్యాల, అక్టోబర్ 21 ( నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో విజయగర్జన సభ నిర్వహించనుండగా, శుక్రవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సారథ్యం వహించే ఈ సమావేశాలకు ఎమ్మెల్యేల నేతృత్వంలో ఒక్కో నియోజకవర్గం నుంచి 25 మంది నాయకులు తరలివెళ్లనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరై విజయగర్జన సభ ఉద్దేశం, విజయవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ ఆధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ 15న వరంగల్లో 10 లక్షల మందితో విజయగర్జన సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేలా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ భవన్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హాజరై దిశానిర్దేశం చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని నియోజకవర్గాల సమావేశాలకు జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సారథ్యం వహిస్తారు.
హాజరుకానున్న నేతలు..
ఈ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. నియోజకవర్గాల వారీ సమావేశాలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రాతినిథ్యం వహించనున్నారు. మంచిర్యాల నియోజకవర్గ సమావేశానికి మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్సీ సతీశ్తో పాటు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రాతినిథ్యం వహించనున్నారు. జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు మంచిర్యాల నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షుడు పల్లపు తిరుపుతి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ హాజరుకానున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఏడు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఏఎంసీ చైర్పర్సన్ గడ్డం పావని తదితరులు హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 మందికి పైగా ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఆ నియోజకవర్గ నేతలు హాజరుకావడంలేదు. హుజూరాబాద్ ఎన్నికల ఘట్టం ముగిశాక చెన్నూర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్నారు.
క్యాడర్లో ఉత్సాహం..
విజయగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కడుతున్నారు. ఏడేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల పాలిట వరంగా మారాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఫలితంగా ప్రజలు టీఆర్ఎస్కు వైపు మొగ్గుచూపుతున్నారు. ఎన్నికల్లో గులాబీ పార్టీ పక్షాన నిలుస్తున్నారు. విజయగర్జన సభకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని నాయకులు అంటున్నారు.