ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 21: ఖానాపూర్ మండలం సుర్జాపూర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో రథానికి బలిపూజలు నిర్వహించిన తరువాత ఆగమ పండితుడు శ్రీనరసింహమూర్తి, స్థానాచార్యుడు అనీష్ ఆచార్య లోక కల్యాణం కోసం స్వామివారి రథాన్ని సుర్జాపూర్ పురవీధుల్లో ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రతి సంవత్సరం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుంచి సుర్జాపూర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వందల సంవత్సరాల క్రితం సుర్జాపూర్లోని కొండపై శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. ఇప్పటికీ గర్భాలయం ఉత్తర దిశలో స్వామివారు స్వయంగా వెలిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. బ్రహ్మోత్సవాలకు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో పాటు పలువురు రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ రాము నాయక్, ప్రధాన కార్యదర్శి బక్కి కృష్ణ, కోశాధికారి మారెల్లి వేణు, జడ్పీటీసీ ఆకుల రాజమణీ వెంకాగౌడ్, సర్పంచ్ చెప్యాల అనురాధా రాజ్కుమార్, ఎంపీటీసీ జంగిలి సరితా శంకర్, ఉప సర్పంచ్ అనుప హరీశ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.