జిల్లా రెండో అదనపు జడ్జి వెంకటేశ్
పలు చోట్ల న్యాయ విజ్ఞాన సదస్సులు
గర్మిళ్ల, అక్టోబర్ 20 : చట్టాలపై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జిల్లా రెండో అదనపు జడ్జి డీ వెంకటేశ్ సూచించారు. బుధవారం జిల్లా అదనపు కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 45 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి మండల, పట్టణ స్థాయి వరకు విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సలహాలతో పాటు అవసరమైతే అడ్వకేట్ను ఉచితంగా కేటాయిస్తామని తెలిపారు. మూడేళ్ల నుంచి ఐదు సంవత్సరాల లోపు న్యాయస్థానంలోని కేసులను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరిగి పోతుండడంతో లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గం ద్వారా ఇరు పక్షాల సయోధ్యతతో కేసులను పరిష్కరిస్తామని తెలిపారు.
చట్టాలపై అవగాహన కల్పించేందుకే సదస్సులు
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 20: ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట మున్సిఫ్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పాల్ సుధాకర్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే బాల్యవివాహాల నిరోధక చట్టం ప్రకారం శిక్ష పడుతుందని తెలిపారు. క్షణికావేశంలో నేరాలు చేయవద్దన్నారు. యువత వ్యసనాలకు దూరంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, ప్రొహిబిషన్ ఎస్ హైమావతి, న్యాయవాదులు జీ. పద్మ, రహ్మతుల్లా, కూడెల్లి అశోక్, చాతరాజు మల్లికార్జున్, శివశంకర్, రవిరాజు, ఎంపీటీసీ గడుసు స్వప్న, రమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగధర్, కోర్టు సిబ్బంది నీరజ, యశోధర తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలంలో..
జైపూర్, అక్టోబర్ 20: మండలంలోని మిట్టపల్లి, కాన్కూర్, రసూల్పల్లి, వెంకట్రావుపల్లె గ్రామాల్లో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. చట్టాలపై శ్రీరాంపూర్ సీఐ బీ రాజు అవగాహన కల్పించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులతో పాటు బాధ్యతలను విధిగా నిర్వర్తించాలన్నారు. పాటుగా మోటర్ వెహికిల్ యాక్ట్, సైబర్ నేరాలు, భూ సంబంధిత చట్టాలపై ఎస్ఐ రామకృష్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ న్యాయవాదులు రాంబాబు, కార్తీక్, రమేశ్, రాజేశ్, నిరంజన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి
జన్నారం, అక్టోబర్ 20 : యువత గంజాయి, గుట్కా లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని చింతగూడలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చాలని, యువత పేకాట, ఇతర బెట్టింగ్కు పాల్పడవద్దని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ పెటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీవో మాధవరావు, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, సీఐ కరీముల్లాఖాన్, ఎస్ఐ మధుసూదన్రావు, గ్రామస్తులున్నారు.