సర్కారు మార్గదర్శకాలు పాటించాల్సిందే..
జన సంచార ప్రదేశాల్లో తిరుగొద్దు..
శుభకార్యాల్లో నిబంధనలు అమలు చేయాలి..
మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ మస్ట్
విచ్చలవిడిగా తిరిగితే ‘మూడో’ ముప్పు నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్న నిపుణులు
జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదని సూచన
నేరడిగొండ, జూన్ 20 : కొవిడ్ రెండో దశ జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. బంధాలు, బంధుత్వాలు, కుటుంబాలను ఛిద్రం చేసింది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని.. 39 రోజులపాటు సర్కారు సడలింపులు ఇస్తూ లాక్డౌన్ విధించింది. ఫలితంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ ప్రకటించింది. మార్గదర్శకాల మేరకే నడుచుకోవాలని సూచించింది. మాస్కులు ధరించకుంటే రూ.1000 జరిమానా విధింపును కొనసాగిస్తున్నది. కాగా.. అంతా ఓపెన్ కావడంతో జనం బయటకొచ్చే అవకాశం ఉంది. జనసమ్మర్థ ప్రదేశాల్లో సంచరించకూడదని, వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం మరచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. శుభ, అశుభకార్యాలకు వెళ్లడం, విచ్చలవిడిగా తిరగడం, ఆలయాలు సందర్శించడం, యాత్రలకు వెళ్లడం చేయకూడదని.. టీకా మాత్రం విధిగా వేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే కరోనా దరిచేరదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ‘మూడో ముప్పు’ తప్పదంటున్నారు.
కొవిడ్ సెకండ్ వేవ్ మానవాళిని అతలాకుతలం చేసింది. ఈ యేడాది మార్చిలో ఉధృతి మొదలు కాగా.. ఆప్తులు, బం ధు వులు, స్నేహితులను దూరం చేసింది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలో సర్కారు లాక్డౌన్ను విధించింది. మే 12న విధించిన సర్కారు.. నాలుగు గంటలే సడలింపు ఇచ్చింది. ఆ తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి కొంత సడలించింది. దానిని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. సర్కారు పక్కాగా, పకడ్బందీగా, ప్రజల సహకారంతో లాక్డౌన్ను అమలు చేసింది. ఫలితంగా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గి, వైరస్ నియంత్రణలోకి రావడంతో లాక్డౌన్ను జూన్ 19న సం పూర్ణంగా ఎత్తివేసింది. ఇప్పుడే అసలు కథ మొదలవుతున్నది. ఇన్నాళ్లు సర్కారు నిబంధనల మధ్య ఇంట్లో ఉన్న జనం ఒక్కసారిగా రహదారులపైకి వచ్చే అవకాశం ఉంది. మూసి ఉన్న బార్లు, సిని మా హాళ్లు, పార్కులు, విద్యాసంస్థలు తెరుచుకోనుండడం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మార్గం సుగమం కావడంతో రద్దీ పెరిగే చాన్స్ అధికంగా ఉంది. ఫలితంగా ఇంతవరకు ప్రభుత్వం పడిన శ్రమ నీటిలో పోసిన పన్నీరులా మారనుంది. లాక్డౌన్ ఎత్తివేసినా జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. లాక్డౌన్ సడలించిన క్రమంలో ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా..
లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేశా రు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడాల్సిందేనని చెబుతున్నారు. బహిరంగ, పని ప్రదేశాలు, ప్రయాణం చేసేటప్పుడు ప్రజలు స్వీయనియంత్రణ విధానాలను విధిగా పాటించాలని కోరుతున్నారు. మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. కా ర్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మనం బాగుంటే.. సమాజం బాగున్నట్లే..
అన్లాక్ నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. ‘అందరూ బాగుండాలి.. అందు లో మనం ఉండాలి’ అనే సూత్రాన్ని పాటించాల్సిన అవసరముంది. పని, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్, షాపింగ్, రద్దీ ప్రదేశాలకు వెళ్లినపుడు ఎదుటివారి కంటే మనమే జాగ్రత్త వహించాలి. వారికి సాధ్యమైనంత మేర భౌతికదూరం పాటించాలి. ఏదైన వస్తువును తాకినపుడు శానిటైజ్ చేసుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చినపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేసి, బట్టలు శుభ్రం చేసుకోవాలి. మన వెంట తీసుకొచ్చిన వస్తువులను కూడా శానిటైజ్ చేయాలి. అనంతరం ఇంట్లోకి తీసుకెళాలి. ఫలితంగా మనతోపాటు ఇతరులు, మన కుటుం బం, చుట్టు పక్కల వారు, సమాజాన్ని రక్షించిన వాళ్లం అవుతాం.
శుభకార్యాలతో జాగ్రత్త
లాక్డౌన్ సమయంలో శుభకార్యాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందిని పరిమిత సంఖ్యలో జనాలకు సర్కారు అనుమతిచ్చింది. దీనిని ప్రజలు కొనసాగిస్తే ఇరువర్గాల ప్రజలకు మంచిది. అన్లాక్ నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లకు భారీగా జనాలను సమీకరిస్తే మొదటికే ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఎలా గూ లాక్డౌన్ ఎత్తి వేశారు కదా అని భారీగా జనా లు శుభ, అశుభకార్యాలకు వెళ్లడం సరైనది కాదు. కరోనా, లాక్డౌన్ వంటి వాటితో కొందరు పెండ్లి ళ్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. గ్రాండ్గా చేయాలని భావిస్తున్నారు. ఇదీ సరైనది కాదు. ఇరువర్గాల బంధువుల సమక్షంలోనే శుభకార్యాలు చేసుకుంటే అందరికీ శ్రేయస్కరం. చాలా మందిని పిలిచి గ్రాండ్గా చేయాలనుకుంటూ మహమ్మారి వ్యాప్తికి కారకులు అవుతారు. దీంతో మూడో ముప్పు దరిచేరే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లాక్డౌన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు అన్లాక్ టైం లోనూ పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
జనసంచార ప్రదేశాలకు వెళ్లవద్దు..
అన్లాక్ నేపథ్యంలో మార్కెట్లు, సంతలు, వాణిజ్య సముదాయాలు, క్లబ్లు, షాపింగ్మాల్స్, జిమ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పర్యాటకం వంటి తదితర ప్రదేశాలు తెరుచుకోనున్నాయి. ఎలాగూ లాక్డౌన్ ఎత్తేశారు కదా అని గుంపులు గుంపులుగా వెళ్లవద్దు. బస్సులు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు, మార్కెట్లు, సంతలకు వినియోగదారులు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలి. లేదంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. జన సంచార ప్రదేశాల్లో తప్పకుండా నిబంధలు పాటిస్తే మన ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారవుతారని నిపుణులు చెబుతున్నారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో…
ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు భక్తుల సంఖ్య పెరగనుంది. లాక్డౌన్ సమయంలో ఆలయాలన్నీ మూసి ఉండడంతో భక్తులు అన్లాక్తో ఆలయ సందర్శనకు క్యూ కట్టనున్నారు. ఇలాంటి క్రమంలో భక్తులందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే మంచిది. లేదంటే వైరస్ వ్యాపించే ప్రమాదముంది. అందుకే భక్తులు నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనాలు, ప్రార్థనలు చేసుకోవాలి. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దేవుని దర్శనం, ప్రార్థనలు చేసుకోవాలంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా మూడో ముప్పుతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మాస్క్ మస్ట్..
కరోనా అంతమయ్యేంత వరకు మాస్క్ ధరిం చడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం, టీకా వేసుకోవడం వంటివి రక్షణ కవచాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. వీటిని మించిన ఆయుధాలు లేవని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కరోనా సోకకుండా ఉండాలంటే వీటిని విధిగా పాటించాలని సూచించింది. కొవిడ్లో వివిధ రకాల వేరియంట్స్ వస్తుండడంతో డబుల్ మాస్కులు కూ డా పెట్టుకోవాలని చెప్పింది. వీటిలో ప్రధానంగా సర్జికల్, ఎన్95 మాస్కులు మాత్రమే పెట్టుకుం టే.. ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకోవడం మరవద్దు. రోజూ కొంత సమయం ఎండలో నిల్చుండడం, పాలు, గుడ్లు, చికెన్, ఫిష్, మటన్ వంటివి తీసుకోవడం.. నడక, శారీరక వ్యాయామం, యోగా తప్పకుండా చేయాలి.
టీకా తప్పనిసరి..
కరోనా ముప్పు నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ మంచి మార్గమని డబ్లూహెచ్వో తెలిపింది. దీనికి అనుగుణంగానే మన ప్రభుత్వాలు టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేశాయి. కళాజాత, అధికారులతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ అవగాహన చర్యలతో టీకా కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాలు కూడా టీకా లు ఉచితంగా వేస్తున్నాయి. దీనిని వినియోగించుకోవాలి. అందరూ టీకా వేసుకుంటే సమాజానికి కరోనా నుంచి తొలగిపోనుంది. అదేవిధంగా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. లాక్డౌన్లో మాదిరిగానే హోం ఐసొలేషన్లో ఉండి, సర్కారు మందులు వాడాలి.