గర్భిణులు, బాలింతకు పౌష్టికాహారం
పైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో మూడు మండలాలు ఎంపిక
సర్వే పూర్తి చేసిన ఐసీడీఎస్
ఉట్నూర్,మే20 : గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో సంభవించే మరణాలే ఎక్కువ. ఈ మరణాలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐసీడీఎస్ ద్వారా ఎక్కువ రక్తహీననతో బాధపడే సమస్యాత్మక ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్ మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద 80 పీటీజీ గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో ఉట్నూర్ ఐసీడీఎస్ పరిధిలో 300 మంది, జైనూర్ ఐసీడీఎస్ పరిధిలో 300 మందిని గుర్తించారు. ఈ మండలాల్లోని గిరిజన కొలాం, తోటి వెనుకబడిన వారితో పాటు గిరిజన ఉపకులాల బాలింతలు, గర్భిణులకు ఒక్కొక్కరికి నెలకు సుమారు కిలో చొప్పున ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూలను అందించి రక్తహీనతకు చెక్ పెట్టేందుకు గిరిపోషణ్ పథకం అమలుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇక ఆచరణే మిగిలింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాచలం, నాగర్కర్నూల్ జిల్లాలో అమలు చేయనున్నారు. దీంతో సుమారు 12 వేల మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరనున్నది.
గిరిజన కుటుంబాల్లోనే
గిరిజన కుటుబాల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటున్నది. అందులో మహిళలకు రక్తం చాలా తక్కువగా ఉంటుంది. అయితే గర్భిణిగా ఉన్న సమయంలో రక్తం శాతం చాలా తక్కువగా ఉండి, సరైన పోషకాలు అందక మరణాలు సంభవిస్తుండేవి. ఈ మరణాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గ్రామస్థాయిలో రక్తహీనతను తగ్గించేందుకు, గిరిజన పోషణ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. దీంతో గర్భిణులకు ఐసీడీఎస్ ద్వారా అందించే పోషకాహారంతో పాటు నెలకు కనీసం కిలో ఇప్ప పువ్వు లడ్డూలు అందించి రక్త శాతం పెంచాలని కార్యాచరణ సిద్ధం చేశారు. దీంతో మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గించేందుకు అవకాశం ఉంది.
జీసీసీ ద్వారా తయారీ
ఏజెన్సీ అడవుల్లో దొరికే ఇప్ప పువ్వు రక్తం పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. దీంతో ఐటీడీఏ గిరిజన సహకార సంఘం(జీసీసీ) ద్వారా ఇప్పపువ్వు, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఇప్ప పువ్వు ద్వారా ఇప్పటికే ఉట్నూర్ కేంద్రంగా ఇప్ప పువ్వు లడ్డూ తయారీ పరిశ్రమను ప్రారంభించారు. దీనిని ఐసీడీఎస్ ద్వారా గిరిజన తెగల గర్భిణులు, బాలింతలకు అందించనున్నారు. రానున్న రోజుల్లో ఐటీడీఏ ద్వారా ఆశ్రమాల్లో చదివే విద్యార్థులకు సైతం అందించి గిరిజనుల్లో చిన్నతనం నుంచే రక్తహీనతనున పూర్తిగా రూపుమాపనున్నట్లు సమాచారం.
సర్వేచేశాం
ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్ప పువ్వు లడ్డూను గర్భిణులకు, బాలింతలకు ఇవ్వాలని కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వేను ఇక్రిశాట్తో కలిసి నిర్వహించాం. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్ మండలాల పరిధిలోని సుమారు 80 పీటీజీ గ్రామాల్లో 600 మంది గర్భిణులకు ఎంపికచేశాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే తాము అందించే పోషకాహారంతో పాటు ఇప్పపువ్వు లడ్డూలను సైతం అందిస్తాం.
శ్రావణి, సీడీపీవో,ఉట్నూర్