సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరా పథకం గడువు సమీపిస్తోంది. డొమెస్టిక్ వినియోగదారులకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్ 31 వరకు వినియోగదారులు తమ క్యాన్ నంబర్లతో అనుసంధానం చేసేకునేందుకు జలమండలి అవకాశం ఇచ్చింది. కానీ పలు సాంకేతిక కారణాలతో వినియోగదారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో కేవలం 41 శాతం మంది వినియోగదారులు మాత్రం ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోసారి అనుసంధానికి అవకాశం ఇవ్వాలని వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో 2021 ఆగస్టు 15 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. మరో 32 రోజులు మాత్రమే అవకాశం ఉండటంతో మీ సేవ కేంద్రాల్లో ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే మాత్రం బిల్లు చెల్లించాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.