చండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్ అగర్వాల్ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని ఆరోపించారు. తన వెంట పోలీసులు ఎవరూ లేరని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని అన్నారు. ఎస్ఎస్పీకి చాలా సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, డీఎస్పీ కూడా తమ మొర ఆలకించలేదని ఆయన ఆరోపించారు.
మరోవైపు బీజేపీ నేత భూపేశ్ అగర్వాల్వి తప్పుడు ఆరోపణలని డీఎస్పీ జేఎస్ తివానా తెలిపారు. బీజేపీ నేతలు లోపల కార్యక్రమం నిర్వహించగా రైతులు బయట నిరసన తెలిపారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ వంద మంది పోలీసులు, ఇద్దరు అధికారులు ఉన్నారని వెల్లడించారు. బీజేపీ నేతలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారి వాహనాల్లో పంపినట్లు చెప్పారు. పోలీసుల ముందు ఎలాంటి దాడి జరుగలేదని, ఆ తర్వాత వారిని రైతులు చుట్టుముట్టి ఉండవచ్చని ఆయన వివరించారు.