రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ, నాటి రాజులు శత్రువుల కుత్త్తుకలు కత్తిరించిన కత్తులు నేటికీ అదే దర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. వడోదరలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్లో ఎన్నో విశేషాలున్నాయి. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గైక్వాడ్ వంశీయుల రాజభవనం శతాబ్దాలు దాటినా చెక్కుచెదరకుండా చరిత్ర ప్రియుల మనసులు దోచేస్తున్నది. ఈ ప్రాసాదంలోని కుడ్యాలపై రవివర్మ గీసిన అద్భుత చిత్తరువులెన్నో దర్శనమిస్తాయి. ఇదే భవనంలో కొలువైంది.. శ్రీ ప్రతాప్ శస్త్రఘర్. రాజపుత్రుల చేతుల్లో తళతళ మెరిసిన పిడిబాకులెన్నో ఇక్కడ పదిలంగా భద్రపరిచారు. దాదాపు రెండు వేల ఖడ్గాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి ఖడ్గం వెనుక వీరగాథ వినిపిస్తుంది. ఆ కత్తిని చేపట్టి ఆనాటి రాజులు చేసిన వీరవిహారం కనిపిస్తుంది. అంతకుమించి ఖడ్గాల నిర్మాణం ‘ఔరా!’ అనిపిస్తుంది. బంగారు పిడి ఉన్నవి, రత్నాలు పొదిగినవి, పులి, ఏనుగు కళాకృతులను పిడిగా మలిచిన ఖడ్గాలు.. పదును తగ్గినా, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దాదాపు 80 ఏండ్ల కిందట లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో ఈ కత్తుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఖడ్గాలను ఉపయోగించిన రాజుల వివరాలనూ పొందుపరిచారు. గురుగోవింద్ సింగ్ కరవాలమని చెప్పే పంచ్కళ ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది. ఏటా గురునానక్ జయంతి సందర్భంగా స్థానిక సిక్కులు ఈ ఖడ్గాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ.