కార్పొరేషన్, జూలై 7: టీఎస్ బీపాస్ ప్రకారం అనుమతి పొందిన మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని, లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణాల్లో టాస్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణాలను తనిఖీ చేయించాలని ఆదేశించారు. అనుమతులు లేని భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మున్సిపల్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి బల్దియా పరిధిలో 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేయాలని, తద్వారా మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం చెందుతాయని పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రతి ఖాళీ స్థలంలో విరివిగా మొకలు నాటాలన్నారు. పట్టణాల్లో నాణ్యతా ప్రమాణాలతో పట్టణ ప్రకృతి వనాలను పెంచాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతిరోజూ చెత్తను బయటకు పంపించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డు సమావేశాలు నిర్వహించాలన్నారు. పట్టణాల్లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను వినియోగంలోకి తేవాలన్నారు. నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ద్వారా ఆస్తిపన్ను వసూలు చేయాలన్నారు.
సమావేశంలో కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గరిమాఅగర్వాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.