సంప్రదాయబద్ధంగా సేవాలాల్ జయంతి

- జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
- కలెక్టర్తో కలిసి జయంతి ఏర్పాట్లపై సమావేశం
ఎదులాపురం, ఫిబ్రవరి 22: సంప్రదాయబద్ధంగా సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి వేడుకలు ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బంజారా కులపెద్దలతో సోమవారం సేవాలాల్ మహరాజ్ జయంతి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారులు జయంతి కార్యక్రమానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరుకావాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా మాట్లాడుతూ ఈ నెల 24న రాంలీలా మైదానంలో నిర్వహించడానికి కమిటీతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనంతరం వేడుకలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు సంధ్యారాణి, ఆర్డీవో జాడి రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎస్ రాజు, డీఎంహెచ్వో నరేందర్, ఉట్నూర్ జడ్పీటీసీ చారులత, సభ్యులు పాల్గొన్నారు.