ప్రజల ముంగిట అభివృద్ధి ఫలాలు..
ఊర్లన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామాలు
మౌలిక వసతుల కల్పనతో కొత్త రూపు
చెత్త సేకరణతో అద్దంలా రోడ్లు
తొలగిన ఆఖరి మజిలీ ఇక్కట్లు ..
పగటిని తలపించేలా విద్యుత్ వెలుగులు
మంచిర్యాల, జూలై 6, (నమస్తే తెలంగాణ) : పల్లెలు, పట్టణాలు ‘ప్రగతి బాట’ పట్టాయి. గ్రామస్వరాజ్యానికి అడుగులు పడ్డాయి. చెత్త సేకరణ, డంప్ యార్డుకు తరలింపు, పారిశుధ్య నిర్వహణ, నిరంతర పర్యవేక్షణతో గ్రామాలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. స్వరాష్ట్ర సంక్షేమ ఫలాలు, మౌలిక వసతులు ప్రజల ముంగిటకు చేరాయి. పచ్చదనం, పరిశుభ్రతతో ఊర్లన్నీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మొదటి, రెండు విడుతల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారగా, మూడో విడుత కార్యక్రమంలోనూ ఊరూవాడా కలిసి నడుస్తున్నాయి. అభివృద్ధే ప్రధానంగా పల్లెలో పనులు సాగుతున్నాయి.
పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. చెత్త సేకరణ, డంప్ యార్డులకు తరలింపు, నిరంతర పర్యవేక్షణ వంటి పనులతో పల్లెలు, పట్టణాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. మూడు విడుతలుగా నిర్వహించిన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. గ్రామాల రూపురేఖలనే మార్చాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజల ముందుకు చేరాయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. పరిశుభ్రతతో రోగాలు దూరమయ్యాయి. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు.
మారిన పల్లె, పట్టణ రూపురేఖలు..
మంచిర్యాల జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, 310 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నది. జనాభా ప్రాతిపదికన నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్నది. జీపీల పునర్విభజనతో పాటు పంచాయతీ రాజ్ కొత్త చట్టం పకడ్బందీగా అమలయ్యేందుకు వీలుగా ఈ శాఖను బలోపేతం చేసింది. ప్రతి మండలానికీ ఎంపీవోను నియమించింది. పంచాయతీకి కార్యదర్శిని కేటాయించింది. ప్రతి పంచాయతీలో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లను సమకూర్చింది.
పచ్చదనం.. పారిశుధ్యానికి ప్రాధాన్యం..
పల్లె ప్రగతిలో ప్రధానంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యానికి ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలో 310 పంచాయతీలకు గాను 310 డంప్ యార్డులు మంజూరయ్యాయి. ఒక్కోటి రూ.2.5 లక్షలతో నిర్మించగా, 100 శాతం పూర్తయ్యాయి. డ్రైనేజీల నుంచి తీసిన మట్టి, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ట్రాలీ ద్వారా పంచాయతీ సిబ్బంది డంప్యార్డులకు తరలిస్తున్నారు. చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చి సంపదను సృష్టిస్తున్నారు. జిల్లాకు 310 వైకుంఠధామాలు మంజూరవగా, 309 పూర్తయ్యాయి.
ఆకుపచ్చని పల్లెలు, పట్టణాల దిశగా..
జిల్లాలో 310 నర్సరీలు ఉండగా, 51.67 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 50.84 లక్షల మొక్కలు బతికి ఉన్నాయి. ప్రకృతి వనాల్లో 8.17 లక్షల మొక్కలు పెంచగా, 7.29 లక్షల మొక్కలు బతికాయి. 2020-21 సంవత్సరంలో పంచాయతీ రాజ్, అనుబంధ శాఖల ద్వారా 25.02 లక్షల మొక్కలు నాటగా, 23.21 లక్షలు బతికి ఉన్నాయి.