షిమ్లా: కరోనా కారణంగా ఏడాది కాలంగా టూరిజానికి పెద్ద దెబ్బే పడింది. తరచూ లాక్డౌన్లు, కరోనా ఆంక్షలు, బయటికెళ్లాలంటే భయపడ్డ జనం ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడెప్పుడు విహార యాత్రలకు వెళ్లాలా అని ఆతృతగా ఉన్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో షిమ్లాకు పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది వేల కార్లు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పక్క రాష్ట్రాల నుంచి ఈ-పాస్లు తీసుకొని మరీ టూరిస్టులు షిమ్లాకు వస్తున్నారు. దీంతో ఆదివారం అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉత్తర భారతంలో ఇప్పటికే ఎండలు మండుతుండటంతో షిమ్లాకు క్యూ కట్టే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. గత శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను సడలించింది. సెక్షన్ 144 ఎత్తేయడంతోపాటు నెగటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవసరం లేదని చెప్పింది. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రారంభమైంది. అయితే 50 శాతం సామర్థ్యంతో నడుపుతున్నారు. ఆదివారం హిమాచల్లో కరోనా కేసుల సంఖ్య 237కు పడిపోయింది.