చెన్నై: ఐఎల్&ఎఫ్ఎస్ స్కామ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) గ్రూప్ మాజీ చైర్మన్ రవి పార్థసారధిని చెన్నై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు (ఈవోడబ్ల్యూ) అరెస్ట్ చేశారు. 2018లో ఆర్థిక సర్వీసుల మార్కెట్లో ద్రవ్య లభ్యతలో సంక్షోభానికి దారి తీసిన స్కామ్ ఇది. ఈ స్కామ్ విలువ రూ. లక్ష కోట్లు.
ఈ కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు న్యాయస్థానం 15 రోజుల పోలీస్ కస్టడీ విధించిందని ఈవోడబ్ల్యూ డీఎస్పీ ప్రకాశ్ బాబు ధ్రువీకరించారు. అయితే, రవి పార్ధసారధి బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నదని తెలుస్తున్నది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
రూ. లక్ష కోట్ల విలువైన ఐఎల్ఎఫ్ఎస్ కుంభకోణం సూత్రధారి, చీఫ్ ఆర్కిటెక్ పార్ధసారధి అని ఆరోపణలు ఉన్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కింద 350కి పైగా సంస్థలు పని చేస్తున్నాయి. అప్పటి మేనేజ్మెంట్ను తప్పుదోవ పట్టించి రవి పార్ధసారధి మోసానికి పాల్పడ్డాడని అభియోగాలు ఉన్నాయి.
రవి పార్ధసారధిపై 63 మూన్స్ టెక్నాలజీస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఈవోడబ్ల్యూ పోలీసులు తెలిపారు. తమకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. పలువురు ఇతర డిపాజిటర్లు కూడా ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రవి పార్ధసారధి హయాంలో ఐఎల్ఎఫ్ఎస్.. 2018 సెప్టెంబర్ త్రైమాసికంలో సమస్యల్లో చిక్కుకుంది. ఈ కుంభకోణం వల్ల సదరు సంస్థకు చెందిన రెండు అనుబంధ సంస్థలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్టర్లుగా మారాయి. ఆ తర్వాత ఈ సంస్థ నిర్వహణ బాధ్యతను కేంద్రం స్వీకరించింది.