మా దగ్గర పెట్టుబడి పెట్టండి.. మీ స్నేహితులు, తెలిసిన వారితో కూడా ఇన్వెస్ట్ చేయించండి.. మంచి లాభాలిస్తాం.. అంటూ నమ్మిస్తూ ఆన్లైన్లో నిండా ముంచేస్తున్నారు. కొందరు ట్రేడింగ్ పేరుతో అమాయకులను వలలో వేస్తుండగా.. మరికొందరు తమ యాప్ల్లో పెట్టుబడి పెట్టండంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. ఇంకో పక్క రోజువారీగా మీకు కొంత పని ఇస్తాం.. దానిని చేసి పెట్టండి… అందుకు గ్యారంటీగా మా వద్ద డిపాజిట్ చేయండి అంటూ ఫేస్బుక్, ఇన్స్ట్రా, వాట్సాప్, టెక్స్ మెసేజ్లతో ఆకర్షిస్తున్నారు. మరికొందరు ఆన్లైన్లో మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ పెట్టుబడులు పెట్టండి.. మీకు తెలిసిన వాళ్లతో కూడా పెట్టుబడి పెట్టిస్తే భారీ కమీషన్ వస్తుందంటూ నమ్మిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా.. వివిధ రకాలుగా సైబర్నేరగాళ్లు వేసే వలలో చిక్కుకొని చాలామంది మోసపోతూ.. సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే.. చాలా మంది అత్యాశకు పోయి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని నమ్మి మోసపోతున్నారని.. అలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.