నాగర్కర్నూల్ : వ్యవసాయానికే సీఎం కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీ పి. రాములు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి. పద్మావతి, కలెక్టర్ యల్. శర్మన్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు.
కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీ నర్సింహస్వామి వారిని దర్శించుకుని, సింగోటం రిజర్వాయర్ విస్తరణ కోసం చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిల్లలో 33/11 K.V సబ్ స్టేషన్లను ప్రారంభించారు. సింగోటం, కల్వకోల్ గ్రామాలకు ఇబ్బంది కలగని రీతిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబధిత ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా పథకాలతో వంద శాతం ప్రభుత్వం పంటల కొనుగోళ్లతో వ్యవసాయం మీద రైతాంగానికి గత ఏడేళ్లలో నమ్మకం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయని ఆ కుటుంబాలకు భరోసానివ్వడం మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలియజేసారు.
కేసీఆర్ దూరదృష్టి మూలంగానే విద్యుత్, వ్యవసాయ, సాగు, తాగునీరు, విద్యా, వైద్య రంగాలలో సమస్యలు అధిగమించగలిగామని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఉన్న కరంట్ కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో లేవని, కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని తెలిపారు.
కరెంట్, రక్షిత నీటి సరఫరాలో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రమే ఇటీవల ప్రకటించిందన్నారు. తెలంగాణలో నూతన వ్యవసాయ విధానాల మూలంగా ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారిందని అన్నారు.
రైతాంగం సంప్రదాయ పంటలు వదిలి మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సూచించారు. పత్తి, కంది, నూనె గింజల పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులను కోరారు.
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు