న్యూఢిల్లీ : దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఫంగస్ బారినపడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ముకార్మైకోసిస్ కేసుల సంఖ్య మొత్తం 11,717కు చేరిందని కేంద్రం తెలిపింది. ఇందులో 65శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్రలో 2,770, గుజరాత్ 2,859, ఆంధ్రప్రదేశ్ 768, మధ్యప్రదేశ్ 752, తెలంగాణలో ఇప్పటివరకు 744 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో 620 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, కేంద్రం డేటాలో 120 కేసులు నమోదైనట్లు చూపింది.
మరో వైపు ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను అదనంగా ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానంద గౌడ బుధవారం తెలిపారు. తాజా కేటాయింపులో 29,250 ఇంజెక్షన్లను విడుదల చేయగా.. ఇందులో అత్యధికంగా గుజరాత్కు 7,210, ఆ తర్వాత మహారాష్ట్రకు 6,980 వయల్స్ను పంపింది. ఏపీకి 1,930, మధ్యప్రదేశ్కు 1,910, తెలంగాణ 1,890, ఉత్తరప్రదేశ్కు 1,780, రాజస్థాన్ 1,250, కర్ణాటక 1,220, హర్యానాకు 1,110 వయల్స్ను అందజేసింది. ఇంతకు ముందు ఈ నెల 24న 19,420 వయల్స్ను సరఫరా చేయగా.. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 23,680 వయల్స్ను సరఫరా చేసింది.