సిద్దిపేట జోన్, మే 23 : దవాఖానకు వచ్చే కరోనా బాధితులకు వైద్యసిబ్బంది ధైర్యం కల్పించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉన్నదని, అందరూ బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఆదివారం సిద్దిపేటలోని మెడికల్ కళాశాల, అనుబంధ దవాఖానలోని కొవిడ్ వార్డును హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీచేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులు, పారిశుద్ధ్య నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ తమిళ ఆరసి, దవాఖాన సూపరింటెండెంట్ జయశ్రీ, వైద్యులు, వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోగిని ఆత్మీయంగా పలుకరించాలని సూచించారు. కుటుంబ సభ్యులే దగ్గరకు రాని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందిస్తున్నరని ప్రశంసించారు. కొవిడ్ బాధితులను కుటుంబ సభ్యులు కలిసేందుకు పాసులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్, మందుల కొరత లేదని స్పష్టంచేశారు.