1.25 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
10 వేల క్వింటాళ్ల జీలుగులు,పిల్లిపెసర విత్తనాలు
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కల్లూరు, మే 22 : ఈ ఏడాది యాసంగి ధాన్యం సేకరణలో ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గానిదే అగ్రస్థానమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డీసీసీబీ డైరెక్టర్, కల్లూరు సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీలుగుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ధాన్యం సేకరణలో సత్తుపల్లి నియోజకవర్గం ముందువరుసలో ఉందని, రైతులు ఈ ఏడాది యాసంగిలో మంచి దిగుబడులు సాధిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.4.50 కోట్లతో 10 వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు, పిల్లిపెసర విత్తనాలు అందజేసిందని, వాటిని రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, ఎంపీపీ బీరవల్లి రఘు, రైతుబంధు సమితి జిల్లా, మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మంగీలాల్, వ్యవసాయాధికారి రూప తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన కల్లూరులో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సహకారంతో 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మండల వైద్యాధికారి, వైద్యులతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు, మండల కేంద్రంలోనే వారు వైద్యం చేయించుకునేందుకు 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సహకారంతో త్వరలోనే దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో పనిచేసేందుకు వైద్యాధికారులు సిబ్బందిని నియమిస్తే ప్రభుత్వం చెల్లించే వేతనాన్ని సైతం స్వచ్ఛందంగా తానే చెల్లిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండల వైద్యాధికారి సత్యచైతన్య, వైద్యులు సురేశ్ పాల్గొన్నారు.