పటాన్చెరు, మే 21 : పటాన్చెరు పట్టణంలోని ఏరి యా దవాఖానలో ఇప్పుడు దాదాపు 70 బెడ్స్ కరోనా రోగులకు అందుబాటులోకి వచ్చాయి. మొదటగా 10 బెడ్స్తో ప్రారంభమైన కొవిడ్ రోగులకు సేవలు, ఇప్పుడు 70బెడ్లకు చేరడంతో స్థానికంగా ఉన్న ప్రజల్లో భరోసా నింపుతున్నది. నాణ్యమైన వైద్యసేవల కారణంగా రోగులు త్వరగా కోలుకొని ఇండ్లకు వెళ్తున్నారు. ఆక్సిజన్ అవసరం అయిన రోగులందరికీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ రోగులకు సిబ్బంది వైద్యసేవలు అందజేస్తుండటంతో కొవిడ్ రోగులకు పటాన్చెరు ఏరియా దవాఖాన వరంలా మారింది. మరోపక్క ఇంటింటికీ జ్వరం సర్వే బృందాలు కరోనా ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి చికిత్స కిట్లను అందజేస్తుండటంతో పటాన్చెరు ప్రాం తంలో కొవిడ్ను వేగం తగ్గుముఖం పడుతున్నది. వివరాల్లోకి వెళ్తే..
పటాన్చెరు పట్టణంలోని టంగుటూరి అంజయ్య దవాఖానలో కొవిడ్ వార్డును మరింత విస్తరిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు సెకండ్ ఫ్లోర్లోనూ బెడ్స్ పెంచుతున్నారు. 10 బెడ్స్తో కరోనా వైద్యసేవలు ప్రారంభం కాగా, ఇప్పుడు వాటిని 70 బెడ్లకు విస్తరించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కొవిడ్ బెడ్లను పెంచారు. అనుభవం ఉన్న డాక్టర్ల బృందం వైద్య చికిత్సలు చేస్తుండటంతో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏరియా దవాఖానలో కొవిడ్ చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు పటాన్చెరులో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలతో పాటు వైద్యం కూడా ఇక్కడే అందుతుండటంతో సాధారణ ప్రజలకు ఏరియా దవాఖాన అపద్బాంధువుగా మారింది. మైల్డ్, మోడరేట్ కేసులను ఇక్కడ పరీక్షించి చికిత్సలు అందజేస్తున్నారు. పరిస్థితి మరీ విషమిస్తే మాత్రం నగరంలోని టిమ్స్, గాంధీకి రిఫెర్ చేస్తున్నారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గిరి, పల్మనాలజిస్ట్ డాక్టర్ స్వాతీ సారథ్యంలో రోగులు త్వరగా కోలుకుంటున్నారు. కార్పొరేట్ వైద్యం కంటే ప్రభుత్వ దవాఖానలోనే నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు.
ఫలితాలు ఇస్తున్న ఇంటింటా జ్వర సర్వే..
ఏరియా దవాఖానలో బెడ్లు ఏర్పాటు చేసిన రోగులు మోస్తరుగానే వస్తున్నారు. ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే చేయించడంతో కొవిడ్ ప్రాథమిక స్థాయిలోనే తగ్గుముఖం పడుతున్నది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లో ఏఎన్ఎం, ఆశవర్కర్, పంచాయతీ సిబ్బందితో కలసి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి కోసం సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలో జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారికి ప్రభుత్వం అందజేసిన చికిత్స కిట్లను అందిస్తున్నారు.
సరిపడా ఆక్సిజన్..
సర్కారు దవాఖానలో సరిపడా మెడికల్ ఆక్సిజన్ నిల్వలున్నాయి. పెరుగుతున్న బెడ్లకు అనుగుణంగా ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 63మంది దవాఖానలో అడ్మిట్ అయ్యారు. వారికి వైద్యసేవలు అందుతున్నాయి. నిత్యం ఆక్సిజన్ను పెడుతున్నారు. ఖాళీ అయిన ఆక్సిజన్ సిలిండర్లను స్థానికంగా ఉన్న సంస్థల వద్ద రీఫిలింగ్ చేయిస్తున్నారు. మరోపక్క బీహెచ్ఈఎల్ సంస్థ, ఇతర సంస్థలు వైద్యపరమైన ఆక్సిజన్ను అందజేసేందుకు ముందుకు వచ్చాయి. అత్యవసరమైతే పలు పరిశ్రమలు కూడా ఆక్సిజన్ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. దేశవిదేశాల్లో వైద్య వృత్తిలో ఉన్న గాంధీ మెడికల్ దవాఖాన పూర్వ విద్యార్థులు రూ.10లక్షల విలువ చేసే 8 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దవాఖాన సుపరింటెండెంట్ వసుంధరకు బహూకరించారు. వీటి ద్వారా కూడా రోగులకు ఆక్సిజన్ సేవలు అందనున్నాయి.