సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి, మే 21: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందశాతం విద్యార్థులు పాసైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి వార్షిక పరీక్ష కోసం ఫీజు చెల్లించిన వారందరినీ ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈసారి ప్రత్యక్ష తరగతులు జరిగిన సమయంలో విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ ఫార్మెటివ్ అసెస్మెంట్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని ఫలితాలు విడుదల చేశారు. హాల్టికెట్లు జారీ చేయనందున పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు చేస్తే హాల్టికెట్ నెంబర్తో పాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
సిద్దిపేట జిల్లాలో పాసైన మొత్తం విద్యార్థులు 14,815
జిల్లా వ్యాప్తంగా మొత్తం 436 పాఠశాలల్లో 14,815 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా ప్రతి ఒక్కరూ పాసైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో 294 ప్రభుత్వ పాఠశాలల్లో 11,734 మంది విద్యార్థులు ఉండగా, 142 ప్రైవేటు పాఠశాలల్లో 3081 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం జిల్లాలో 7226 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లోని 4,888 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, 2338 మంది ప్రైవేటు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 2983 మంది బాలురు 10/10 సాధించగా, 4243 మంది బాలికలు 10 జీపీఏ సాధించారు. జిల్లాలో అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలంలో 10 జీపీఏ సాధించగా, అతి తక్కువగా మర్కూక్ మండలంలో 10 జీపీఏ సాధించారు.
మెదక్ జిల్లాలో 11,428 మంది విద్యార్థులు పాస్
ఫార్మెటివ్ అసెస్మెంట్స్(ఇంటర్నల్ పరీక్షల్లో 20 శాతం మార్కుల ఆధారంగా) ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తూ శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 11,428 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 3701 మంది విద్యార్థులు 10/10 జీపీఏ గ్రేడ్ సాధించారు. వీరిలో బాలురు 5709కి గాను 1491 మంది 10/10 జీపీఏ గ్రేడ్ సాధించగా.. బాలికలు 5,719కి గాను 2210 మంది 10/10 జీపీఏ సాధించినట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 22,563 మంది విద్యార్థులు పాస్
సంగారెడ్డి జిల్లాలో పదో తరగతులు చదువుతున్న బాల, బాలికలు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 22,563 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 11,516 మంది, బాలికలు 11చ047 మందిని ప్రభుత్వం పాస్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.