పకడ్బందీగా చేపట్టాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ శరత్
కామారెడ్డి టౌన్, మే 18: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి రెండో విడుత ఆరోగ్య సర్వేను నిర్వహించాలని, లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని జనహిత భవన్లో కామారెడ్డి డివిజన్కు చెందిన వైద్య, రెవెన్యూ, పంచాయతీ, రవాణాశాఖ అధికారులతో కొవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడుతలో లక్షణాలు ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనే విషయాలను నమోదు చేసుకోవాలని సూచించారు. హోమ్ ఐసొలేషన్లో ఉన్న వారు మందులు సరిగా వాడుతున్నారా..? లక్షణాలు తగ్గాయా అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హోమ్ ఐసొలేషన్ వసతి లేని వారికి, తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని కొవిడ్ సెంటర్లలో చేర్పించాలని సూచించారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రజలకు వివరించాలన్నారు. అవసరం ఉన్న ప్రదేశాల్లో ప్రభుత్వ వసతి గృహాలను ఐసొలేషన్ కోసం వినియోగించుకోవాలని, బాధితులకు అక్కడ భోజన వసతి కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఆశ, ఏఎన్ఎంలు పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాక్సినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాలని, వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న కేంద్రాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 48 గంటలకు అవసరమ్యే ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా రవాణా శాఖ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకటమాధవరావు, ఆర్డీవో ఎన్.శీను, డీఎంహెచ్వో చంద్రశేఖర్, జిల్లా ప్రభుత్వ దవాఖానల కో-ఆర్డినేటర్ అజయ్కుమార్, ఆర్టీఏ వాణి, తహసీల్దార్లు, ఎంపీవోలు, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.