కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి
కొల్లాపూర్ రూరల్, మే 12: రైతులెవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ మండలం రామాపురంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం అకాల వర్షాలకు అక్కడక్కడా కొనుగోలు కేంద్రాల్లో రైతులు తూకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయినట్లు సమాచారం అందింది. అయినా రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరలేదన్నారు. తూకమైన తర్వాత ధాన్యం బస్తాలు ఆరుబయటే ఉంటే వాటికి కచ్చితంగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. అలాగే ముందే ధాన్యం తీసుకొచ్చిన రైతులు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో రామాపురం సర్పంచ్, వెలుగు ఏపీఎం తిరుపతయ్య, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
కొల్లాపూర్ రూరల్, మే 12: కొల్లాపూర్ ఆర్డీవో హనుమానాయక్ కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. సంబంధిత అధికారులను కొనుగోలుకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగనీయొద్దని ఆర్డీవో ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షాలకు రైతుల ధాన్యం తడిసిందా, ఏమైనా నష్టం జరిగిందా అని తనిఖీ చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ నిర్దేశించిన మద్దతు ధరకు ధాన్యం కొంటున్నారా లేక నిబంధనల పేరుతో రైతులను ఏమైనా ఇబ్బందులను పెడుతున్నారా.. అని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు ఆర్డీవో హనుమానాయక్ పేర్కొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
బిజినేపల్లి, మే 12 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు శ్రీశైలం ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలోని శాయిన్పల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతారు. కావునా ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాము, రమణ, యాదయ్య, తిరుపతయ్య, నిరంజన్, లచ్చమ్మ ఉన్నారు.
కొండనాగులలో..
అచ్చంపేట, మే 12: కరోనాలాంటి విపత్తులు వచ్చిన సీఎం కేసీఆర్ రైతులకు బాసటగా నిలుస్తున్నారని కొండనాగుల పీఏసీసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్ అన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కరోనాలాంటి విపత్తులు వచ్చి ప్రపంచం మొత్తం గడగడలాడుతుంటే సీఎం కేసీఆర్ రైతుల పక్షాల నిలబడుతున్నారన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన ధాన్యం కొనుగోళ్లు, రైతులకు వినహాయింపు ఇచ్చారన్నారు. రైతులు, వ్యవసాయానికి సంబంధించి మినహాయింపు ఇచ్చి రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ధాన్యం భారీగా వచ్చిందన్నారు. కేఎల్ఐ ద్వారా సాగునీరు ఇవ్వడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో వరిసాగు చేశారన్నారు. రైతులకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణ రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతులకు ఎక్కడా సమస్య లేకుండా కావాల్సిన పథకాలు అమలు చేస్తూ సకాలంలో అందిస్తున్నారన్నారు. రైతుల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందన్నారు. ధాన్యం విక్రయాలకు వస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కొండనాగుల పీఏసీసీఎస్ సీఈవో రాజవర్ధన్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.