బీర్కూర్ మే 10 : మానసిక స్థితి సరిగ్గా లేక ఓ తల్లి కన్నబిడ్డలను హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. స్థానికుల జోక్యంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పడాల సవితకు భైంసాకు చెందిన సాయినాథ్తో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. మొదటి కాన్పు కోసం బీర్కూర్కు వచ్చిన ఆమె తిరిగి కాపురానికి వెళ్లలేదు. కుమారుడితో ఇక్కడే ఉంటున్నది. గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. దీంతో మరో కుమారుడు జన్మించాడు. కానీ సవిత రోజురోజుకూ మతి స్థిమితం లేకుండా, మానసిక రోగిలా తయారైంది. ఆదివారం 10 గంటల సమయంలో తన కుమారులను చంపేందుకు యత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్సై మండల కేంద్రానికి చెందిన ఎంపీపీ తిలకేశ్వరి రఘు, రైతు బంధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాంలను పిలిపించి ఆమె పరిస్థితిని వివరించారు. పిల్లలను అంగన్వాడీ సిబ్బంది వద్ద ఉంచారు. పిల్లలను జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి అప్పగించాలని నిర్ణయించారు. సోమవారం ఆ విభాగం కౌన్సిలర్ దత్తు రావడంతో పిల్లలను వారికి అప్పగించారు. ఈ విషయమై ఆ విభాగం డీసీపీవో స్రవంతి ఫోన్లో మాట్లాడుతూ సవిత కుమారులను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదన్కు తరలిస్తామని తెలిపారు.