జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు
ఈ ఏడాది 3లక్షల పత్తి బ్యాగులు అవసరమని గుర్తింపు
హెచ్టీ పత్తి విత్తనాలు, పెరిగిన ఎరువుల ధరపై నిఘా
నిర్మల్ టౌన్, మే 8: రైతులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో విత్తనాలు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్లో ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, పెరిగిన ఎరువుల ధరలపై జిల్లా స్థాయిలో కలెక్టర్ను చైర్మన్గా టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. ఈ టీంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ సీఐ రమేశ్బాబు, తెలంగాణ విత్తన సీడ్ కంపెనీ మేనేజర్ అబిత్కుమార్, వ్యవసాయ టెక్నికల్ ఆఫీసర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులను నియమించింది. దీని పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారితో పాటు సబ్ డివిజన్లో ఏడీఏలు నిరంతరం విత్తనాలపై నిఘా పెట్టనున్నారు. నిర్మల్ జిల్లాలో నీటి వనరులు, నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంత రైతులు ప్రధానంగా వానకాలంలో పత్తి పంటను పండిస్తారు. గతేడాది జిల్లాలో లక్ష 70వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా ఈ సారి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు 3లక్షల పత్తి బ్యాగులు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 360 విత్తన ఎరువుల దుకాణాల డీలర్లు ఉన్నారు. వారి ద్వారా పత్తి విత్తనాలు విక్రయిస్తారు. ప్రధానంగా ఈ నెల 20 నుంచే జిల్లాలో పత్తి విత్తనాల కొనుగోళ్లు చేపడుతారు. పత్తి విత్తనాల బ్యాగు గతేడాది రూ.731 ఉండగా ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 30 పెంచింది. ప్రైవేట్ విత్తన యజమానులు ఇప్పటికే గ్రామాల్లో పత్తి విత్తనాలపై పెద్దఎత్తున ప్రచారం చేయడం, డీలర్లకు బ్యాగులను సరఫరా చేసి మార్కెట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తదితర రాష్ర్టాల నుంచి నిర్మల్ జిల్లాకు పత్తి విత్తనాలు దిగుమతి చేసుకుంటారు. ప్రధానంగా పత్తిలో బీటీ-1,2 ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ైగ్లెఫోసెట్ గడ్డిమందు పిచికారీ చేసిన తట్టుకునే పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయన్న ప్రచారంతో వీటిపై నిఘా పెంచారు. గతేడాది భైంసా, ఖానాపూర్, కడెం, తానూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పత్తి విత్తన బ్యాగులు బయటపడడంతో ఈసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతున్నది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన అప్పారావుపేట్, బెల్తరోడా, దౌనెల్లి, ధర్మాబాద్ ప్రాంతా ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ను రోజువారీగా ఆన్లైన్ రిపోర్టు తెప్పించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే డీలర్లకు సూచించారు. భూసారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపనున్న హెచ్టీ (హెర్బిసైడ్ టోలిరెన్స్)తో పాటు గ్లెఫోసెట్ గడ్డి మందులను విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల ధ్రువీకరించిన పత్తి విత్తనాలతో పాటు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.