కోటగిరి, మే 3:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారీ ప్రతి అంశంపై ప్రభావం చూపుతున్నది. ఈక్రమంలో వివాహాలపై కూడా కొవిడ్ ఎఫెక్ట్ పడింది. మే రెండో వారం నుంచి పెండ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 950కి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉన్నది. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండడంతో వివాహాలు ఎలా జరిపించాలని వధూవరుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
మే మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది వివాహాలు జరిపించేందుకు తేదీలను నిర్ణయించుకున్నారు. ఫంక్షన్ హాళ్లకు అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. దీంతో పాటు వంటవారు, వీడియోగ్రాఫర్లు, పెళ్లి పందిర్లు వేసే వారిని కూడా బుక్ చేసుకున్నారు. పెండ్లి కోసం కావాల్సిన దుస్తులు కూడా ఇప్పటికే కొనుగోలు చేశారు. కరోనా విజృంభిస్తుండడంతో ప్రస్తుతం వీరి పరిస్థితి ముందుకు వెళ్లలేము.. వెనక్కు రాలేమనే విధంగా మారింది. వివాహాలను వాయిదా వేసుకోవాలా..? తక్కువ మందితో జరిపించుకోవాలా..? అనే సందిగ్ధం ఏర్పడింది. పదిహేను రోజుల్లోనే జిల్లాలో వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది.
మేలో శుభ ముహూర్తాలు..
మే రెండోవారం నుంచి వివాహాది శుభ ముహూర్తాలు ఉన్నాయి. మేలో 13, 14, 20, 21, 22, 23, 26, 28, 30 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 5, 6, 13, 16, 18, 19, 20, 23, 24, 26, 27 తేదీల్లో, జూలైలో 1,2,3,4 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.దీంతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వందలాది పెళ్లిళ్లు ఖరారయ్యాయి. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా ప్రభావం తగ్గడంతో మే, జూన్, జూలై నెలల్లో వివాహాలు చేసేందుకు చాలా మంది నిశ్చయించుకున్నారు. ముహూర్తాలు దగ్గరపడడంతో ఏర్పాట్లు సైతం ముమ్మరం చేశారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రోజుకో గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టుకుంటుండడంతో ముహూర్తాలు పెట్టుకున్న వారిలో కలవరం మొదలయ్యింది.
ఉపాధిపై ప్రభావం..
ప్రతి సంవత్సరం వేసవికాలంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎండాకాలంలో పాఠశాలలకు సెలవులు ఉండడంతో చాలా మంది అప్పుడే వివాహాలు, ఇతర శుభకార్యాలను చేసేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో శుభముహూర్తాలపై వంటవారు, పురోహితులు, వీడియోగ్రాఫర్లు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, డెకరేషన్ చేసేవారు, మంగళవాయిద్యాల వారు, దర్జీలు, ఇతర వ్యాపారులు ఆధారపడి ఉపాధి పొందుతారు. గత ఏడాది కరోనా ప్రభావం ప్రారంభం కావడంతో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండానే చాలా మంది పెండ్లిళ్లు చేస్తున్నారు. దీంతో శుభకార్యాలకు వివిధ పనులను చేసే వారి ఉపాధికి ఏడాది కాలంగా గండిపడుతున్నది. అప్పుడప్పుడు చిన్న చిన్న శుభకార్యాలకు ఉపాధి లభిస్తుండడంతో బతుకుబండిని ముందకు నడిపిస్తున్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు..
మేలో శుభ ముహూర్తాలు ఉండడంతో ఇప్పటికే చాలా మంది ఫంక్షన్ హాళ్లు, ఇతర అవసరాల కోసం అడ్వాన్స్ బుకింగ్లు కూడా చేసుకున్నారు. పెండ్లి వాయిదా వేసుకుందామంటే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితులు లేవు. పెండ్లి చేద్దామనుకుంటే ప్రభుత్వ ఆంక్షలతో పాటు ఏం జరుగుతుందో అనే ఆందోళన. దీంతో కొద్దిమంది సమక్షంలోనే వివాహాలు చేసేందుకు పలువురు మొగ్గుచూపుతుండగా.. మరికొందరు వాయిదా వేసుకుంటున్నారు.
పూల సరఫరాకు అడ్వాన్స్ తీసుకున్నాం..
మే నెలలో ముహూర్తాలు ఉండడంతో ముందుగానే పూల సైప్లెకి అడ్వాన్స్ తీసుకున్నాం. గతేడాది కరోనాతో తీవ్రంగా నష్టపో యాం. ఈఏడాది రెండు నెలల సీజన్తో అంతా కవర్ అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.