డీఎంహెచ్వో జయచంద్రమోహన్
నారాయణపేట, ఏప్రిల్ 26: పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. సోమవారం కొవిడ్ వ్యాక్సిన్పై పోలీస్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిషిల్డ్, కోవ్యాక్సిన్ రెండు రకాలుగా వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. వ్యాక్సిన్ కోసం http:// self registration.cowin.gov.in లింక్ ద్వారా పోలీస్ కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గుండె ఆపరేషన్లు, బాలింతలు, గర్భిణులు, ఎలర్జీ ఉన్న వారు వేసుకోరాదన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి మూడు రోజుల ముందు, మూడు రోజుల తర్వాత మద్యం తాగరాదన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిపై వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించాలన్నారు. వీసీలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.