బస్సులను శానిటైజేషన్ చేస్తున్న సిబ్బంది
నిత్యం పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ అధికారులు
తెలంగాణచౌక్, ఏప్రిల్ 25: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మాస్కులున్న ప్రయాణికులనే కరీంనగర్ బస్టాండ్లోకి అనుమతిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మైక్ ద్వారా కరోనా జాగ్రత్తలను వివరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో శానిటైజేషన్ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఆవరణలోని దుకాణాల్లో ముందు జాగ్రత్తలు పాటించి తినుబండారాలు, ఇతర వస్తువులను విక్రయించాలని యాజమాన్యాలకు అధికారులు సూచనలు చేశారు. మాస్కులు ధరించనివారికి వస్తువులను విక్రయించవద్దని చెబుతున్నారు. బస్సులో ప్రయాణికులు మాస్క్ ధరించేలా కండక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 45 ఏండ్లు నిండినవారు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు మాస్క్లు ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు నిండిన రీజినల్ పరిధిలోని సిబ్బందికి డిపో మేనేజర్లు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్ ఇప్పించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.