భారీగా పెరిగిన కొత్త ప్రీమియంల ఆదాయం
ముంబై, ఏప్రిల్ 21: కరోనా వైరస్ నేపథ్యంలో అటు ఆరోగ్య బీమాలకేగాక.. ఇటు జీవిత బీమాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎల్ఐసీ మినహా ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియంల ఆదాయం 8 శాతం పెరిగింది. చివరి త్రైమాసికం జనవరి-మార్చిలో 40 శాతం వృద్ధి కనిపించింది. ఒక్క మార్చి నెలలోనే గతంతో పోల్చితే 90 శాతం న్యూ ప్రీమియం ఇన్కమ్ ఎగిసింది. ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లకు మార్కెట్లో విశేష ఆదరణ లభించింది.
ఎల్ఐసీ జోరు
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలోనూ కొత్త కస్టమర్ల హవా కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియంల ఆదాయం మునుపెన్నడూ లేనివిధంగా రూ.1.84 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశంలోని మొత్తం జీవిత బీమా పాలసీల్లో ఎల్ఐసీ వాటా 81.04 శాతంగా ఉండటం గమనార్హం.
ఐఆర్డీఏఐ కొరడా
నిబంధనలు పాటించని నాలుగు బీమా కంపెనీలపై ఐఆర్డీఏఐ జరిమానాలు విధించింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై రూ.25 లక్షలు, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్పై రూ.13 లక్షలు, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై రూ.10 లక్షలు, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్పై రూ.3 లక్షల ఫైన్ పడింది.