ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడి
జడ్చర్ల/అచ్చంపేట, ఏప్రిల్10: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న జడ్చర్లకు వస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి శనివారం ఎమ్మెల్యే బాదేపల్లి మార్కెట్ యార్డును పరిశీలించారు. జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.15కోట్లతో చేపట్టే పలు అభివృద్ధ్ది కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, విజయనగర్కాలనీ, లక్ష్మినగర్కాలనీ, కావేరమ్మపేట, బాదేపల్లిలో సీసీరోడ్లు, బీటీరోడ్లకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. కావేరమ్మపేటలోని నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్ను ప్రారంభించిన అనంతరం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే సభలో పాల్గొననున్నట్లు తెలిపారు. అచ్చంపేటలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 14న నిర్వహించే సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నట్లు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సభాస్థలాన్ని పరిశీలించారు.