ఏటా కోటికి పైగా చేపల పెంపకం
చేపల విక్రయానికి రాయితీపై వాహనాలు
బలోపేతమవుతున్న మత్య్స సంఘాలు
గిరిజనులు, మత్య్సకారులు కలిసి వ్యాపారం
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ.. వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. వలసలు నివారించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందించి చేయూతనిస్తున్నది. అంతేకాదు, చేపలను విక్రయించేందుకు రాయితీపై వాహనాలు అందజేస్తున్నది. వ్యాపారానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. దీని ద్వారా మత్స్యసంపదను పెంపొందించడంతోపాటు మత్స్యకారుల ఉపాధికి బాటలు వేస్తున్నది.
కొత్తగూడెం ఏప్రిల్ 6 : అన్ని ఆహారల్లో కల్లా చేపలను అందరూ ఇష్టంగా తింటారు. గతంలో ఆంధ్రా చేపలు కోసం వేచి చూసేవారు. తిరువూరు, విజయవాడ, కాకినాడ నుంచి ఐస్బాక్స్లో తీసుకొచ్చిన చేపలు తినేది. తెలంగాణ వచ్చాక సీన్ మారింది. మత్య్ససంపద మన దగ్గరే తయారవుతోంది. ఇప్పుడు మన చెరువుల్లోని చేపలనే తింటున్నాం. మిషన్ కాకతీయతో రాష్ట్ర ప్రభుత్వం చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చింది. మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కల్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 691 చెరువుల్లో ఏటా కోటికి పైగా ఉచితంగా చేపపిల్లలను వదలడంతో వాటిని విక్రయించడానికి రాయితీపై వాహనాలను అందజేసింది. మత్య్సకారులతోపాటు గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు సొసైటీల్లో సభ్యత్వం ఇచ్చి చేపల వేటలో నైపుణ్యం కల్పించారు.
ఏటా కోటికి పైగా చేపల పెంపకం
చెరువుల్లో పెరిగే చేపల ద్వారా ఆదాయం వచ్చేలా మత్య్సశాఖ ఏటా ఉచితంగా సొసైటీ సభ్యులకు చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. గతేడాది జిల్లాలో 691 చెరువుల్లో 1,78 లక్షల చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. ఇందులో 654 సీజనల్ చెరువులు ఉండగా.. 34 చెరువుల్లో శాశ్వత నీరు ఉండే చెరువులున్నాయి. ఇవేకాక మూడు రిజర్వాయర్లలో చేపలు పెరుగుతున్నాయి. ఏటా మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
ఇప్పటికే 56 సొసైటీలను ఏర్పాటు చేసుకున్నారు. 2,686 సభ్యులు సభ్యత్వం కలిగి ఉన్నారు. మత్య్సకారులే కాకుండా గిరిజనులు ఇందులో సభ్యులుగా ఉండి చేపల విక్రయాలతోపాటు పెంపకంలో భాగస్వామ్యులవుతున్నారు.
కోట్లతో మొబైల్ వాహనాలు
చేపల పెంపకంతోపాటు వాటిని సమయానికి విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం రాయితీపై వాహనాలు అందజేసింది. ఇప్పటి వరకు ఆయా సంఘాల సభ్యులకు రూ.7 కోట్లతో 75శాతం రాయితీతో మొబైల్ వాహనాలు, టూవీలర్ వాహనాలను అందజేసింది.771 టూవీలర్స్, 10 మొబైల్ నాలుగు చక్రాల వాహనాలు, 26 లగేజీ ఆటోలతోపాటు చేపలను పట్టుకునే వలలు, టెంట్లు, లాగుడు వలలను అందజేశారు.
రాయితీపై వలలు ఇచ్చారు
చేపలు పట్టడానికి ఎలాంటి పరికరాలు కావాలన్నా రాయితీపై ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో చేపల కోసం దూరప్రాంతాలకు వెళ్లి చేపలు పట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన ప్రభుత్వం వచ్చింది చాలా బాగుంది. మంచిగా పెంచుకుంటే చేపలు బాగా ఎదుగుతాయి. మంచి ఆదాయ వనరు.-తెల్లం ధర్మారావు, చినరాయిగూడెం