న్యాయవాద వృత్తిలో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. నేర్పు, ఓర్పు, మనోధైర్యం చాలా అవసరం. అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కెరీర్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఆ అవరోధాలన్నీ అధిగమించి, ఇటీవలే ‘ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ లీగల్ పవర్లిస్ట్ -2020’లో స్థానం సంపాదించారు హైదరాబాద్కు చెందిన సుందరి ఆర్ పీసుపాటి. 2008లో ‘టెంపస్ లా అసోసియేట్స్’ అనే సంస్థను ప్రారంభించారామె. ఆ కంపెనీ కార్పొరేట్ కేసులు వాదిస్తుంది. “నేను గత 27 ఏండ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాను. పట్టా చేతికి రాగానే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తర్వాత అమెరికా వెళ్లి కొలంబియా లా స్కూల్లో మాస్టర్స్ చేశాను’ అన్నారు సుందరి. ఈ గ్లోబల్ లాయర్కు న్యూయార్క్లో ప్రాక్టీస్ చేసేందుకు కూడా లైసెన్స్ ఉంది. ‘వృత్తిని ఎంతగా ప్రేమిస్తే కెరీర్లో ఎదురయ్యే సవాళ్లను అంత ధైర్యంగా, సులువుగా ఎదుర్కోగలం’ అంటారామె.