నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతుల కల సాకారం కానున్నది. కొన్నేండ్లుగా భవిష్యత్తు లేక వెలవెలబోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు జీవం పోసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నేడు అమలులోకి రానుంది. కొండపోచమ్మ సాగర్కు చేరిన కాళేశ్వర జలాలను హల్దీ వాగు మీదుగా నిజాంసాగర్కు తరలించి బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే ప్రక్రియ సులువు కానుంది. ఇందుకోసం 15 కిలో మీటర్ల మేర కొత్తగా కాలువ తవ్వకం పూర్తి కాగా వర్గల్ మండలం గౌరారం సరస్వతీ ఆలయం వద్ద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గలగల మంటూ గోదావరి ఎగిరి దుంకుతూ రాబోతోంది. ఈ మధురమైన క్షణాల కోసం నిజాంసాగర్ ఆయకట్టు రైతులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. మంగళవారం ఉదయం 11గంటలకు నీటి విడుదల ఘట్టం ఆవిష్కృతం కానుండడంతో కాలువల మార్గం గుండా కాళేశ్వరం జలాలు నిజాంసాగర్కు చేరాలంటే సరిగ్గా పది రోజుల సమయం పడుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
32 చెక్డ్యామ్లను నింపుకొని…
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే కాళేశ్వరం నీళ్లను వర్గల్ మండలం హౌసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాలువలోకి సీఎం కేసీఆర్ విడుదల చేస్తారు. హల్దీ కాలువలో 1666 క్యూసెక్కులతో నీళ్లు ప్రవహిస్తాయి. దా దాపు 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుంచి నిజాంసాగర్లోకి నీళ్లు చేరుతాయి. గోదావరి జలాల విడు దలతో 32 చెక్ డ్యామ్లు నింపునున్నారు. ఒక్కో చెక్డ్యామ్లో 0.62 టీఎంసీలు నీరు నిల్వ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అనంతరం ఒక్కో చెక్డ్యామ్ను దాటుకుని పది రోజుల్లో గోదావరి జలాలు మంజీరా నదిలో పడి నిజాంసాగర్కు చేరనుండడం గమనార్హం. గోదావరి జలాల రాకతో వేసవి కాలంలోనూ పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా పోతాయి. రైతుల దశ, దిశను మార్చే విధంగా కొండపోచమ్మ సాగర్ నీటి తరలింపు ప్రక్రియను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. నదులకు కొత్త నడక నేర్పిన అపురూపమైన ఘట్టంగా ఇరిగేషన్ అధికారులు ఈ ప్రక్రియను అభివర్ణిస్తున్నా రు. కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు గోదావరి జలాల చేరికకు 96 కిలో మీటర్ల దూరం ఉంది.
ఎక్కడి గోదావరి.. ఎక్కడెక్కడికో…
ఏటా కొన్ని లక్షల క్యూసెక్కుల వర్షపు నీరు గోదావరి నది వెంట సముద్రంలో కలుస్తున్నది. తలాపున జీవనది ఉన్నప్పటికీ మన రాష్ర్టానికి జల సందడి తీసుకు వచ్చిన దాఖలాలు గతంలో ఏనాడు లేదు. స్వరాష్ట్రంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో యావత్ తెలంగాణ ప్రజల గోసను తీర్చడం కోసం భగీరథ ప్రయత్నానికి పూనుకున్నారు. కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వర ప్రాజెక్టు సరిగ్గా మూడేండ్లలో రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లక్షలాది బీడు భూములకు పారుతున్నది. ఇందుకోసం గోదారమ్మ తన దిశను మార్చుకున్నది. పల్లం నుంచి ఎత్తుకు ప్రవాహాన్ని మళ్లించింది. మెట్ట భూములను తడిపేందుకు ఎండిన చెరువులను నింపి రైతన్నల పొలాల్లో సిరులు పండించేందుకు వందల కిలో మీటర్లు దాటుకుని వస్తుంది. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి వంద మీటర్ల వద్ద ప్రారంభమయ్యే గోదావరి జలాల ప్రయాణం 624 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మలోకి అర కిలో మీటరు ఎత్తుకు ఎగిసి పడబోతోంది. కొండపోచమ్మ సాగర్ వరకు చేరిన కాళేశ్వర జలాలు నేడు మరోమారు దిశను మార్చుకుని హల్దీ వాగు మీదుగా మంజీరా నదిలోకి కలువబోతున్నాయి. మంజీరా నది గుండా వచ్చిన జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకోనున్నది.
ప్రత్యామ్నాయమే పరిష్కారం
నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వరప్రదాయిని కానున్నది. ప్రస్తుతం అతి కష్టం మీద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతున్నాయి. ఈ చారిత్రక ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు. దీనికింద ఆయకట్టు 2.30 లక్షల ఎకరాలుండగా ఎగువ నుంచి వరద లేక ఏండ్లుగా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం లేదు. నాలుగేండ్ల క్రితం 2017 లో 10టీఎంసీల నీరు మాత్రమే చేరగా ఆ తర్వాత భారీగా వరద నీరు రాక జలకళ తప్పింది. 2020 వానకాలంలో సింగూర్ నిండడంతో వరద పోటెత్తి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను రికార్డు స్థాయిలో ఎత్తి దిగువకు వరదను పంపించారు. వచ్చే సీజన్లో ఈ తరహాలో వరద పోటెత్తుతుందా? అన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో నిజాంసాగర్కు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు.
వరద నీరు రాకపోవడంతో బోసిపోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో సార్థకత చేకూరబోతోంది. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లికి అక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తారు. 25 కిలో మీటర్ల సొరంగ మార్గం ద్వారా జలాలు ప్రవేశించి సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్ మీదుగా శ్రీరంగనాయకసాగర్లోకి చేరవేస్తారు. ఇక్కడి నుంచి గోదావరి జలాలను మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్కు తరలించాల్సి ఉండగా మల్లన్నసాగర్ వద్ద పనులు కొనసాగుతున్నందున ప్రత్యేక మార్గం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరంగనాయకసాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్కు మళ్లిస్తున్నారు. కొండపోచమ్మ నుంచి ప్యాకేజీ 18 కింద కాలువల ద్వారా హల్దీ వాగు మీదుగా నిజాంసాగర్కు కాళేశ్వరం జలాలు చేరుతాయి.
ఇవీ కూడా చదవండి…
కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట