కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్
గొర్రెల పంపిణీకి నిధులు కేటాయింపు పట్ల హర్షం
రఘునాథపాలెం, మార్చి 31: కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండో విడతగా గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ చేసేందుకు రూ.3వేల కోట్లు కేటాయించారు. దీంతో గొల్లకుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు అందజేస్తున్న గొర్రెలతో జీవనం సాగిస్తున్నామని మొదటి విడతలో గొర్రెలు పొందిన గొల్లకుర్మలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో మేలైన రకాల గొర్రెలను పోషిస్తున్నామన్నారు. మాంసం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గొర్రెలు, మేకల పెంపకాలు కూడా పెరుగుతున్నాయని గొల్లకుర్మలు అంటున్నారు. ఈ మేకలు, గొర్రెలను మూడు పద్ధతుల్లో పెంచుతుంటామని చెబుతున్నారు. కొన్ని షెడ్లలో ఉండేవి, మరికొన్ని బయట వాతావరణంలో తిరిగేవి, ఇంకొన్ని మధ్యాహ్నం తిరిగేవి. తెలంగాణలో ఎక్కువగా బయట వాతావరణంలో తిరిగే గొర్రెలు, మేకలనే ఎక్కువగా పెంచి పోషిస్తుంటారని కాపరులు అంటున్నారు. వాటి పెంపకానికి ప్రభుత్వం నుంచి పోత్సహకాలు లభిస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంచి ఏడాదినే వాటిని రెట్టింపు చేస్తున్నామని చెబుతున్నారు. జీవాలకు గాలికుంటు, దోమపుండు, గెట్టె పుండ్లు వంటి వ్యాధులు రాకుండా వైద్యాధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు టీకాలు వేయిస్తున్నామని అంటున్నారు. గొర్రెల పంపిణీతోనే తమ బతుకులు మారుతున్నాయని గొల్లకుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.