మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలి
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ
రాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ర్టానికే తలమానికంగా నిలుపాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సిరిసిల్ల పట్టణంలోని వైకుంఠధామం, రైతుబజార్, బతుకమ్మ ఘాట్, హరిదాస్నగర్లోని అర్బన్ లంగ్ స్పేస్ పార్కులను సందర్శించి, పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ప్లానింగ్ అధికారి అన్సార్ వివిధ విభాగాల అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధి పనులను సమీక్షించారు. పురపాలక శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో ఆయన ఆశయానికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇళ్లకు డిజిటల్ డోర్ నంబరింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్క్, దివ్యాంగుల భవనం, సెంటర్ ఫర్ అర్బన్ హోం లెస్, మోడల్ స్లాటర్ హౌస్, సిటీ శానిటేషన్ ప్లాన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలోని వైకుంఠధామాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిరిసిల్లకు పర్యాటక శోభ
శ్రీరాజరాజేశ్వర బ్యాక్ వాటర్తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ వచ్చిందని సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ తరహాలో సిరిసిల్ల పట్టణం పర్యాటక కేంద్ర బిందువుగా మారుతుందని, ఇంకా వీకెండ్ స్పాట్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తదితరులు ఉన్నారు.